Income Tax: మరో భారీ స్కామ్... రూ. 3,200 కోట్ల టీడీఎస్ ఎగవేత... నిందితుల్లో రాజకీయ నేతలు, సినీ నిర్మాతలు!

  • టీడీఎస్ ను ఎగ్గొట్టిన 447 కంపెనీలు
  • వారంట్లను జారీ చేసిన ఐటి శాఖ
  • గరిష్ఠంగా ఏడేళ్ల వరకూ శిక్ష

దేశంలో మరో భారీ కుంభకోణం బయటపడింది. ఆదాయపు పన్ను విభాగం దీన్ని వెలుగులోకి తెచ్చింది. ఇందులో మొత్తం 447 కంపెనీల ప్రమేయం ఉండగా, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సుమారు రూ. 3,200 కోట్లను ఆయా కంపెనీల యాజమాన్యం నొక్కేసింది. ఉద్యోగుల నుంచి టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ఈ కంపెనీలు ఐటీ శాఖకు చెల్లించలేదని చెబుతూ, ఈ కంపెనీలకు ఐటీ చట్టం ప్రకారం వారంట్లను జారీ చేసింది. ఆరోపణలు రుజువైతే ఈ కంపెనీల యజమానులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ఈ కంపెనీలపై మోసం, నమ్మకద్రోహం సెక్షన్లను కూడా జోడించాలని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల్లో అత్యధికం రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవి కాగా, వాటిల్లో ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఓ రాజకీయ నేత సంస్థ దాదాపు రూ. 100 కోట్లను ఉద్యోగుల నుంచి టీడీఎస్ రూపంలో కట్ చేసుకుని, ప్రభుత్వానికి కట్టకుండా వ్యాపార అవసరాలకు తరలించినట్టు తేలిందని తెలిపాయి.

ఇక, ఈ 447 కంపెనీల్లో సినీ నిర్మాణ సంస్థలు, మౌలిక రంగంలోని కంపెనీలు, స్టార్టప్ సంస్థలు ఉన్నాయని సమాచారం. ఓ మౌలిక సంస్థ రూ. 14 కోట్లను ఎగ్గొట్టగా, మరో ఐటీ సేవల సంస్థ రూ. 11 కోట్లను చెల్లించలేదని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. 'ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018' మధ్య వసూలు చేసిన టీడీఎస్ నుంచి ఈ 3,200 కోట్లు కేంద్రానికి రావాల్సి వుందని, ఈ కంపెనీలపై చట్టపరమైన చర్యలుంటాయని ఆయన వెల్లడించారు.

More Telugu News