Palace of Wheels: సామాన్యుడికి త్వరలో 'మహారాజ' యోగం... సగానికి సగం తగ్గనున్న లగ్జరీ రైళ్ల టికెట్ల ధరలు!

  • లగ్జరీ రైళ్ల ఛార్జీలను సగానికి సగం తగ్గించనున్న రైల్వే శాఖ...!
  • ఈ రైళ్లపై విదేశీ ప్రయాణికులకు తగ్గిన మోజు
  • రాష్ట్ర పర్యాటక శాఖలు, ఐఆర్‌సీటీసీలపై తగ్గింపు భారం..!

ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియట్, మహారాజా ఎక్స్‌ప్రెస్ లాంటి లగ్జరీ రైళ్లు ఇప్పటివరకు ఎగువ మధ్యతరగతి వాళ్లకు, ధనికులకు మాత్రమే పరిమితమైపోయాయి. కానీ, భారత రైల్వేలు త్వరలోనే వాటిని సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా వాటిలో ప్రయాణ ఛార్జీలను సగానికి సగం తగ్గించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ ఛార్జీలు ఇప్పటివరకు వేలల్లో ఉన్నాయి.

'ది పయనీర్' నివేదిక ప్రకారం, తగ్గించిన ఈ ఛార్జీల వల్ల వచ్చే నష్టాలను రాష్ట్ర పర్యాటక శాఖలు, ఐఆర్‌సీటీసీ లాంటి భాగస్వాములు భరించాల్సి ఉంటుంది. ఈ లగ్జరీ రైళ్లపై విదేశీ ప్రయాణికుల ఆసక్తి గణనీయమైన రీతిలో తగ్గిపోవడం కూడా ఛార్జీల తగ్గింపు నిర్ణయానికి ఓ కారణం. ప్యాలెస్ ఆన్ వీల్స్, రాయల్ రాజస్థాన్ లగ్జరీ రైళ్ల రెవెన్యూ వరుసగా 24 శాతం, 63 శాతానికి పైగా పడిపోయింది. ఈ రెండు రైళ్లను భారత రైల్వే శాఖే నడిపిస్తోంది. ఈ నెల 1న జరిగిన రైల్వే బోర్డు సమీక్షా సమావేశంలో ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

More Telugu News