marriage: 10 కోట్లు ఇస్తేనే నా మొదటి భర్త విడిచి పెడతాడట... హైదరాబాదులో పెళ్లి నాటకమాడిన కశ్మీర్ యువతి!

  • కశ్మీర్ యువతిని వివాహమాడిన హైదరాబాదీ 
  • వివాహమైన కొన్ని రోజులకే ఆమెకు అంతకు ముందే పెళ్లైనట్టు గుర్తించిన భర్త 
  • మొదటి భర్తను వదిలించుకుని వస్తానన్న భార్య

10 కోట్లు ఇస్తే తన మొదటి భర్త విడిచిపెడతాడంటూ కొత్త నాటకానికి తెరదీసిన కశ్మీరీ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాదులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదుకు చెందిన ఫరీద్ హుస్సేన్ ఖాన్ కు వివాహం చేయాలన్న ఉద్దేశ్యంతో అతని స్నేహితులు సౌజియా నిజామి, అల్తామష్ నిజామీలు కశ్మీర్‌ కు చెందిన అబిదా హుస్సేన్ అనే యువతితో పెండ్లికుదిర్చారు. దీంతో అబిదా హుస్సేన్ గత నవంబర్ 5న బంధువులు అల్తాఫ్మ్రజ్, ఇష్ట్రత్ బట్‌ లతో కలిసి వచ్చి, బంజారాహిల్స్‌ లోని స్కైలా సర్వీస్ అపార్టుమెంట్‌ లో బస చేసింది. అదే నెల 11న మత పెద్దల సమక్షంలో ఫరీద్ హుస్సేన్ ఖాన్ తో అబిదా హుస్సేన్ కు వివాహం జరిగింది.

వివాహం జరిగిన కొన్ని రోజులకే, ఆమెకు అంతకుముందే మరోవ్యక్తితో పెళ్లి జరిగినట్టు తెలియడంతో భర్త ఆమెను నిలదీశాడు. అంతలోనే ఆమె మొదటి భర్త ఫోన్ చేసి, నా భార్యను ఎలా వివాహం చేసుకుంటావంటూ హుస్సేన్ ఖాన్ ను నిలదీశాడు. దీంతో తన మొదటి భర్తతో తెగదెంపులు చేసుకొని వస్తానని అబిదా కశ్మీర్ వెళ్లిపోయింది. కొన్ని రోజుల తరువాత మళ్లీ హైదరాబాదు వచ్చి, 10 కోట్ల రూపాయలిస్తే కానీ తన మొదటి భర్త తనను విడిచిపెట్టనంటున్నాడని హుస్సేన్ ఖాన్ కు తెలిపింది.

దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు, రెండో వివాహం అబిదా, ఆమె మొదటి భర్త ఆవేష్ రాజ్‌ పుత్ కలిసి ఆడిన నాటకమని గుర్తించారు. దీంతో అబిదా, ఆవేశ్ రాజ్ పుత్, వివాహానికి వచ్చిన ఆమె బంధువులను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News