rammohan naidu: ఈ నెల 5 నుంచి పార్లమెంటులో మా ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తాం!: ఎంపీ రామ్మోహన్‌

  • దేశంలో ఉన్న అన్ని పార్టీలకు రాష్ట్ర పరిస్థితిని వివరిస్తూ లేఖలు రాస్తాం
  • హక్కులను సాధించుకునే క్రమంలో అన్ని ప్రయత్నాలు చేస్తాం
  • ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్‌, పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అన్ని అంశాలపై పోరాడతాం
  • ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతాం

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై దేశంలోని అన్ని పార్టీలకు లేఖలు రాస్తామని అలాగే నాలుగేళ్లు మిత్రపక్షంగా ఉన్న తాము ఎందుకు ఇలా ఆందోళన చేస్తున్నామో లేఖల ద్వారా వివరిస్తామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక సాయంపై పోరాడాల్సిన తీరుపై చర్చించామన్నారు.

ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి సాయం చేయకపోవడంపై పార్లమెంటులో ఆందోళన తెలిపామని, కానీ అరుణ్ జైట్లీ అప్పట్లో చెప్పిన మాటే మళ్లీ చెప్పారని రామ్మోహన్‌ నాయుడు అన్నారు. మార్చి 5 నుంచి ప్రారంభం కాబోయే సమావేశాల్లో తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు.  
 
హక్కులను సాధించుకునే క్రమంలో అన్ని ప్రయత్నాలు చేస్తామని, ప్రత్యేకహోదాతో పాటు రైల్వే జోన్‌, పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అన్ని అంశాలపై పోరాడతామని తెలిపారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగాలని అన్నారు. తాము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.

More Telugu News