Anita: రాజస్థాన్‌లో దారుణం...మంత్రగాళ్ల చేతిలో మహిళ మృతి.. 45 రోజుల పాటు శవం గదిలోనే...!

  • దుష్టఆత్మలు ఆవరించాయంటూ ప్రత్యేక పూజలు
  • తామే బాగు చేయగలమని మంత్రగాళ్ల ప్రగల్భాలు
  • చనిపోవడంతో మళ్లీ బతికిస్తామంటూ హామీలు
  • నిందితుల అరెస్టు..పరారీలో ప్రధాన నిందితుడు

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యం పాలైన ఓ 35 ఏళ్ల మహిళను మంత్రాలతో, శాంతి పూజలతో బాగుచేస్తామని నమ్మబలికి చివరకి ఆమె ప్రాణాలు తీశారు ఐదుగురు మంత్రగాళ్లు. వారు అంతటితో ఆగలేదు. ఆమెను తిరిగి బతికిస్తామంటూ 45 రోజుల పాటు ఆమెను గదిలోనే ఉంచి తాళం వేశారు. చివరికి ఆమె సోదరుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిందిత మంత్రగాళ్లు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. పరారీలో ఉన్న వారి నాయకుడిని పట్టుకోవడానికి పోలీసులు వేట ప్రారంభించారు.

 రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉన్న గంగాపూర్ పట్టణంలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకెళితే...మంత్రగాళ్ల తప్పుడు ప్రయోగాలకు తనువు చాలించిన 35 ఏళ్ల అనిత జనవరిలో అనారోగ్యంపాలైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను మంత్రగాళ్ల వద్దకు తీసుకెళ్లారు. ఆమెను దుష్టాత్మలు ఆవరించాయని, తాము మాత్రమే ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయగలమని మంత్రగాళ్లు నమ్మబలికారు.

ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లకుండా ఆమె కుటుంబాన్ని వారు నిరోధించారు. కానీ, అదే నెల 14న స్పృహ కోల్పోయిన ఆమెను తన రూమ్‌లోనే ఉంచి తాళమేశారు. అదే సమయంలో ఆమె చనిపోయినట్లు మంత్రగాళ్లకు తెలిసినప్పటికీ, ఆమె త్వరలోనే తిరిగి లేస్తుందని వారు నమ్మకంగా చెప్పారు. వారు అనిత ఇంట్లోనే ఉంటూ ఆమె శరీరం నుంచి సువాసనలు వస్తున్నట్లుగా ఆమె కుటుంబానికి భ్రమ కలిగే రీతిలో ఆ ఇంట్లో ఏవేవో సుగంధ పరిమళాలను వెదజల్లారు. కానీ మంత్రగాళ్ల మాయాజాలంపై అనుమానం వచ్చిన అనిత సోదరీమణుల్లో ఒకరు పక్క ఊర్లో ఉండే తమ సోదరుడికి మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. అదే నెల 27న అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

More Telugu News