Gujarat: మోదీ, మాల్యాలా పారిపోలేక... ఆత్మహత్య చేసుకున్న గుజరాత్ యువ వ్యాపారి!

  • గుజరాత్ లో వస్త్ర వ్యాపారం చేస్తున్న విజయ్ కుటుంబం
  • నష్టాలు రావడంతో అప్పులు చేసిన విజయ్
  • తీర్చే దారి కనిపించకు భార్యా, బిడ్డతో కలసి ఆత్మహత్య

లలిత్ మోదీ, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ... వీరందరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుగా?... ఇండియాలో నేరాలకు పాల్పడి, బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేసి దర్జాగా బతుకుతున్న వారు. ఇక ఇండియాలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు ఎందరో ఉన్నారని, వారందరినీ బయటకు తీయాలన్న డిమాండ్ పెరుగుతున్న వేళ, గుజరాత్ కు చెందిన ఓ యువ వ్యాపారి తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలసి ఓ అపార్టుమెంట్ 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరత్ లో తీవ్ర కలకలం రేపింది.

వస్త్ర వ్యాపారంలో రాణించలేకపోయిన విజయ్ వాఘాసియా (35), ఆయన భార్య రేఖ (30), కుమారుడు వీర్ (4)లతో కలసి ఈ పనికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. యోగి చౌక్ లోని మెజిస్టిక్ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న ఆయన, వ్యాపారంలో విజయం సాధించడంలో విఫలం అయ్యారని, చేసిన అప్పులు తీరే దారి తెలియక ఇంత దారుణానికి పాల్పడ్డారని వెల్లడించారు.

ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ, లేఖను రాసుకుని తన జేబులో పెట్టుకున్న విజయ్, తన కుటుంబం మరణానికి ఎవరూ కారణం కాదని, తన ఆర్థిక సమస్యలు తీరే దారి తెలియకనే ఈ పని చేశానని, తన తరువాత తన సోదరుడికి వ్యాపార బాధ్యతలు అప్పగిస్తున్నానని చెప్పాడు. పారిపోయి పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేకనే ఆయన ఈ పని చేశారని గుజరాత్ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారం అవుతున్నాయి.

More Telugu News