theft: 25 కేజీల బరువున్న లాకర్ ను ఎత్తుకెళ్లి పగులగొట్టిన దొంగల ముఠాకు షాక్!

  • పనిమనిషి ఇచ్చిన సమాచారంతో దొంగతనం
  • లాకర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించి విఫలం
  • లాకర్ ను ఎత్తుకెళ్లిపోయిన దొంగలు

బంగారం దుకాణం యజమానికి చెందిన లాకర్ ఎత్తుకెళ్లి ఓపెన్ చేసిన దొంగలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులోని జేసీ నగర్‌లో నివసించే బంగారం దుకాణం వ్యాపారి భాటియా ఇంట్లో ఈనెల 20న దొంగలు పడ్డారు. వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేసే ఏడుగురు కలిసి దొంగల ముఠాగా ఏర్పడ్డారు. వారిలో ఒకరి సోదరి భాటియా ఇంట్లో పనిచేస్తుంది.

ఆమె ఇచ్చిన సమాచారంతో, భాటియా కుటుంబం మొత్తం నాలుగు రోజుల పాటు ఇంట్లో ఉండరని, దొంగతనం చేసేందుకు అంతకుమించిన సమయం ఉండదని సూచించింది. దీంతో ఇంట్లో ప్రవేశించిన దొంగలు భాటియా నగలు, నగదు భద్రపరచుకునే 25 కేజీల బరువుండే లాకర్‌ ను పగులకొడదామని చూస్తే సాధ్యపడలేదు. దాంతో దానిని అలాగే ఎత్తుకెళ్లిపోయారు.

తీరా ఇంటికి వెళ్లాక దాన్ని తెరిచి చూసి.. నోరెళ్లబెట్టారు. ఎందుకంటే అందులో భారీ ఎత్తున నగలు, నగదు ఉంటాయని భావించిన దొంగల ముఠా ఆశలు ఆవిరయ్యేలా ఆ లాకర్ లో కేవలం 100 రూపాయల నోటు మాత్రమే ఉంది. భాటియా ఇంట్లో సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, దొంగల ముఠాను అరెస్టు చేసి, వారి నుంచి పలుచోట్ల చోరీ చేసిన 7లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News