Sridevi: దుబాయ్ వెళ్లే ముందు శ్రీదేవి నాతో మాట్లాడింది.. ఆమె ఆరోగ్యం బాగుండలేదు!: పింకీరెడ్డి

  • శ్రీదేవి దుబాయ్ వెళ్లే ముందు తనతో మాట్లాడాను
  • తనకు జ్వరం, గొంతునొప్పి ఉందని శ్రీదేవి చెప్పింది
  • ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి కూతురు పింకీరెడ్డి

నటి శ్రీదేవి దుబాయ్ కి వెళ్లే ముందు తనతో మాట్లాడారని, తన ఆరోగ్యం కొద్దిగా బాగుండ లేదని, జ్వరం, గొంతునొప్పి ఉందని తనకు చెప్పిందని ప్రముఖ సోషలేట్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి కూతురు పింకీరెడ్డి అన్నారు. శ్రీదేవికి ఆప్త మిత్రురాలైన పింకీరెడ్డి ‘ఏబీఎన్’తో మాట్లాడుతూ, శ్రీదేవి చనిపోయిందంటే తనకు మొదట ఏమీ అర్థం కాలేదని, ఆ తర్వాత తన భర్తను అడిగానని చెప్పారు.

ఆ తర్వాత అనిల్ కపూర్ భార్యకు ఫోన్ చేసి మాట్లాడాను. బోనీకపూర్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారని, అయితే ఆయన ఏడుస్తూనే ఉన్నారని అన్నారు. బోనీ-శ్రీదేవి జంట ఒకరంటే మరొకరికి ప్రాణమని, ఇద్దరు పిల్లలు వారి ప్రాణమని అన్నారు. జాహ్నవి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి చనిపోయారంటే ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదని, ఆమె మరణించిందంటే నమ్మలేకపోతున్నానని వాపోయారు. పెళ్లిలో బాగా అలసిపోవడం వల్లే, ఆమె దుబాయ్ లోనే ఉండిపోయిందని అన్నారు.

చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసంటే శ్రీదేవికి బాగా ఇష్టం 


శ్రీదేవి తమ ఇంటికి ఎప్పుడొచ్చినా చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు బాగా ఇష్టంగా తినేదని చెప్పారు. తాను ఎప్పుడైనా ముంబైలోని శ్రీదేవి నివాసానికి వెళ్లేదానినని, తామిద్దరం కలిసి బయటకు వెళ్లేవాళ్లమని, తన బాడీగార్డ్, మేనేజర్ కూడా లేకుండా ఆమె తనతో బయటకు వచ్చేదని పింకీరెడ్డి గుర్తు చేసుకున్నారు.

More Telugu News