Sridevi: ఆ తర్వాత శ్రీదేవి జీవితం పంజరంలో పక్షిలా మారిపోయింది!: రామ్ గోపాల్ వర్మ

  • శ్రీదేవిని కలుసుకున్న నాటి నుంచి ఆమె జీవితం నాకు తెలుసు
  • తండ్రి ఉన్నంత వరకు ఆమె జీవితం ఎగిరే పక్షిలా ఉండేది
  • ఆమె తల్లి అతిభద్రతా భావం కారణంగా శ్రీదేవి జీవితం పంజరంలో పక్షిలా మారిపోయింది : వర్మ

శ్రీదేవి తన తండ్రి మరణం తర్వాత పంజరంలో పక్షిలా అయిపోయిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ‘శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ’ అంటూ ‘ఫేస్ బుక్’లో వర్మ పోస్ట్ చేసిన లేఖలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను శ్రీదేవిని కలుసుకున్న నాటి నుంచి ఆమె జీవితం నాకు తెలుసు. తండ్రి మరణించే ముందు వరకు శ్రీదేవి జీవితం ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉండేది. కానీ, ఆమె తల్లి అతిభద్రతా భావం కారణంగా శ్రీదేవి జీవితం పంజరంలో పక్షిలా మారిపోయింది’ అన్నారు.

శ్రీదేవి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది!

‘పన్నుల భయం కారణంగా ఆ రోజుల్లో నటీనటులకు నల్లధనాన్నే రెమ్యూనరేషన్ గా ఇచ్చేవారు. శ్రీదేవి తండ్రి తన బంధువులను, స్నేహితులను బాగా నమ్మేవారు. ఆ డబ్బును వారి వద్ద దాచేవారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ డబ్బును ఆమెకు ఇవ్వకుండా అందరూ మోసం చేశారు. దీనికితోడు, లిటిగేషన్ లో ఉన్న ఆస్తులను ఆమె తల్లి కొనుగోలు చేయడంతో పాటు కొన్ని తప్పుల కారణంగా శ్రీదేవి డబ్బంతా అయిపోయింది. ఆ సమయంలోనే బోనీకపూర్ ఆమె జీవితంలోకి ప్రవేశించారు. బోనీకి కూడా అప్పుడు బాగానే అప్పులు ఉన్నాయి. ఆ సమయంలో శ్రీదేవి కన్నీళ్లు తుడవడం తప్ప, బోనీ చేయగలిగినదేమీ లేదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News