e-wallet: ఈ-వ్యాలెట్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ!

  • ఫిబ్రవరి 28 తర్వాత కూడా లావాదేవీలు జరుపుకోవచ్చు
  • కేవైసీ సమర్పణకు రేపటితో లాస్ట్
  • గడువును పెంచబోమన్న ఆర్బీఐ

ఈ-వ్యాలెట్ యూజర్లకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. తమ వ్యాలెట్లలో ఉన్న సొమ్మును ఫిబ్రవరి 28 తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఆ సొమ్మును తమ బ్యాంకు ఖాతాలకు తిరిగి పంపుకోవచ్చని పేర్కొంది. అయితే రేపటి లోపు వినియోగదారులు తమ ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) విధివిధానాలను పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో పేటీఎం, మొబిక్విక్, ఓలా మనీ, అమెజాన్ పే వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.

కేవైసీ గడువు ఈనెల 28తో ముగుస్తుందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే చాలినంత గడువు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐఎస్)లు జారీ చేసేవారు మాత్రం గడువు లోపల తమ వినియోగదారుల కేవైసీని సమర్పించకున్నా యూజర్లు తమ వ్యాలెట్లలో ఉన్న సొమ్మును కోల్పోరని కనుంగో వివరించారు.

ప్రస్తుతం 55 నాన్-బ్యాంక్ పీపీఐలకు ఆర్బీఐ లైసెన్స్‌లు జారీ చేసింది. వీటికి అదనంగా 50 ఈ-వ్యాలెట్లు కూడా ఉన్నాయి. నిజానికి వీరికి కేవైసీ సమర్పించేందుకు గతేడాది డిసెంబరు 31ని గడువుగా ప్రకటించింది. ఆ తర్వాత దానిని ఫిబ్రవరి 28కి పొడిగించారు.

More Telugu News