Sridevi: బోనీకపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ శ్రీదేవిని బాగా ఇబ్బంది పెట్టేవాడట!: బాబాయి వేణుగోపాల్

  • గతాన్ని గుర్తు చేసుకున్న శ్రీదేవి బాబాయ్ ఎం.వేణుగోపాల్
  • పలు ఆసక్తికర విషయాలు వెల్లడి
  • శ్రీదేవికి ఎవరితోనూ మనస్పర్థలు లేవన్న వేణుగోపాల్

బోనీకపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ తనను బాగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి శ్రీదేవి బాధపడేదని ఆమె బాబాయి ఎం.వేణుగోపాల్ తెలిపారు. శ్రీదేవి మరణవార్త తెలిసిన వెంటనే వేణుగోపాల్ భార్య, కొందరు బంధువులు ముంబైలోని శ్రీదేవి ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు ఉన్న తర్వాత హోటల్‌లో రూము తీసుకుని ఉన్నట్టు చెప్పిన వేణుగోపాల్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

శ్రీదేవి మరణం విషయంలో ఏం జరిగిందో అర్థం కావడం లేదని, తాము కూడా అందరిలాగే టీవీల్లో చూసే తెలుసుకున్నామని పేర్కొన్నారు. బోనీకపూర్ తొలి భార్య కుమారుడు అర్జున్ కపూర్ తనను ఇబ్బంది పెడుతున్నట్టు బంధువుల దగ్గర చెప్పుకుని, శ్రీదేవి చాలాసార్లు బాధపడిందని తెలిసిందని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఓసారి భర్త బోనీకి షుగర్ బాగా పెరిగిపోతే శ్రీదేవి చాలా ఆందోళనకు గురైందని, తనూ, పిల్లలు ఏమైపోతామోనని బాధపడిందని అన్నారు.

శ్రీదేవి చాలా మంచి అమ్మాయని, సున్నిత మనస్కురాలని తెలిపారు. ఆమెకు ఎవరితోనూ గొడవలు లేవని స్పష్టం చేశారు. చెల్లెలు శ్రీలతతో ఆమెకు ఉన్నవి ఆస్తి తగాదాలు కావని పేర్కొన్నారు. తల్లి రాజేశ్వరి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఆపరేషన్ జరిగిందని, అప్పుడు ఒకచోట చేయాల్సిన ఆపరేషన్‌ను మరోచోట చేస్తే ఆమె చనిపోయిందని వివరించారు. ఈ విషయంలో ఆసుపత్రిపై కేసు పెట్టారని, ఆ తర్వాత డబ్బుల విషయంలో ఇద్దరికీ మనస్పర్థలు వచ్చాయి తప్పితే అంతకుమించి మరేమీ లేదని తేల్చి చెప్పారు.

శ్రీదేవికి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టమని, అయితే ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్నాక తిండి బాగా తగ్గించిందని తెలిపారు. బోనీ కపూర్ తమతో బాగానే ఉంటారని, చూడగానే నమస్కారం పెడతారని పేర్కొన్నారు. శ్రీదేవి ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగినా బంధువులతో మాత్రం చక్కగా ఉండేదని, మద్రాస్ వెళ్లినా తమతో టచ్‌లోనే ఉండేదని వివరించారు. తాము ఇల్లు కట్టుకుంటున్నామని తెలిసి మార్బుల్స్ అవీ పంపించిందని గుర్తు చేసుకున్నారు. ఇంటికి తమ వాళ్లు ఎవరు వచ్చినా అంతో ఇంతో ఇచ్చి పంపిస్తుండేదని వేణుగోపాల్ గుర్తు చేసుకున్నారు.

More Telugu News