Harish Rao: ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి హరీశ్ రావు.. కంగుతిన్న అధికారులు

  • కాళేశ్వరం ప్రాజెక్టు పనులలో మరింత వేగం పెంచడానికి తనిఖీలు
  • కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం పనుల పరిశీలన
  • పలు ఆదేశాలు జారీ 
  • గేట్ల తయారీ బిగింపు పనులు వేగం పుంజుకోవాలని ఆదేశాలు

కాళేశ్వరం ప్రాజెక్టు పనులలో మరింత వేగం పెంచడానికి తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖ‌ మంత్రి హరీశ్ రావు ఈ రోజు ఆక‌స్మిక‌ తనిఖీలు చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సదస్సులో పాల్గొన్న మంత్రి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం పనులను పరిశీలించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధుల‌కు, అధికారులకు స‌మాచారం ఇవ్వకుండా మంత్రి హుటాహుటిన ప్యాకేజి 8కి చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది కంగుతిన్నారు.

ఈ నెల 22, 23 తేదీలలో కాళేశ్వరం పనులను పరిశీలించాలని నిర్ణయించినప్పటికీ, ఢిల్లీ పర్యటన, ఇతర కార్యక్రమాలతో ఆయన పర్యటన వాయిదా పడింది. రైతు సమన్వయ సమితుల సదస్సు వల్ల కరీంనగర్ కు చేరుకున్నందున సమయాన్ని క్షణం కూడా వృథా చేయకుండా ప్యాకేజి 8 పనుల వద్ద తనిఖీలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పనులను సందర్శించారు. గ్రావిటీ కెనాల్ పైన నిర్మిస్తున్న 10 స్ట్రక్చర్స్ పనులను పరిశీలించారు.

పనులు ఇంకా వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. కెనాల్ లైనింగ్ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఏజన్సీల ను ఆదేశించారు. వరద కాలువ జంక్షన్ పాయింట్ డిజైన్లు త్వరగా సబ్మిట్ చెయ్యాలని ఏజెన్సీకి చెప్పారు. ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరాన్ని గడువు లోపున పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులు,ఏజన్సీలను హరీశ్ రావు ఆదేశించారు.

మోటార్ల బిగింపు పనులు, గేట్ల తయారీ బిగింపు పనులు కూడా వేగం పుంజుకోవలసి ఉందని మంత్రి అన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తి తెలంగాణ బీడు భూముల్లో పారించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని సాధించాలని మంత్రి అన్నారు. ఇందుకు గాను రేయింబవళ్లు కృషి చేయాలని ఆయన కోరారు. గోదావరిపై నిర్మించే మూడు బరాజ్‌లు, మూడు పంప్‌ హౌజ్‌లతో పాటు కీలకమైన ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ మార్గం పనుల పురోగతిని కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నట్టు చెప్పారు.

కాళేశ్వరంకు చెందిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపు హౌజ్ లు, అన్నారం-కన్నేపల్లి గ్రావిటీ కెనాల్ పనులతో పాటు ఇతర ప్యాకేజిల పనులను వేగవంతం చేయాలన్నారు. వర్షాకాలానికి ముందే సివిల్, మెకానికల్ పనులు పూర్తయ్యేలా చూడాలని ఇరిగేషన్ మంత్రి కోరారు. ఏజన్సీ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఆయన వెంట ఎంపీ బీబీ పాటిల్, ఈఎన్‌సీ అనిల్, కాళేశ్వరం సీఈ నల్ల వెంకటేశ్వర్లు ఉన్నారు.

More Telugu News