Telugudesam: రైతుల కిచ్చే ఉగాది కానుక ఇదే : ఏపీ టీడీపీ నేత పయ్యావుల

  • లేదారు చెరువుకు హంద్రీ నీవా నీరు విడుదల
  • ఎన్నో ఏళ్లుగా నీరు లేక ఎండిపోయిన చెరువులు
  • ఆ చెరువులకు హంద్రీనీవా నీటిని అందిస్తున్న ఘనత చంద్రబాబుదే : పయ్యావుల

ఎన్నో ఏళ్లుగా నీరు లేక ఎండిపోయిన చెరువులకు వేసవి కాలంలో హంద్రీ నీవా నీరు అందిస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని, ఏపీ ప్రభుత్వం రైతులకిచ్చే ఉగాది కానుక ఇదేనని శాసనమండలి చీఫ్ విప్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద హంద్రీ నీవా ప్రధాన కాలువ నుంచి లేదారు చెరువుకు ఈరోజు నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎండిపోయిన చెరువులకు హంద్రీనీవా నీటిని అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబునాయుడుదేనని ప్రశంసించారు. లేదారు చెరువుకు నీటిని విడుదల చేయడం ద్వారా నాలుగు గ్రామాలు సస్యశ్యామలం కానున్నాయని, పామిడి మండలంలోని చెరువులకు కూడా నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దశల వారీగా అన్ని చెరువులకు నీరందించే ప్రణాళికలు పూర్తి చేసినట్టు పయ్యావుల కేశవ్ తెలిపారు.  

More Telugu News