Sridevi: భారత్ లో మాదిరే మా దేశంలో కూడా శ్రీదేవిని అంతగానూ అభిమానిస్తారు!: పాక్ నటుడు అద్నాన్ సిద్ధిఖీ

  • శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది
  • ‘మామ్’లో ఆమెతో కలిసి నటించడం నా అదృష్టం
  • శ్రీదేవి అంత్యక్రియలకు భారత్ రావాలని ఉంది : అద్నాన్ సిద్ధిఖీ

భారత్ లో శ్రీదేవిని ఎంతగా అభిమానిస్తారో, పాకిస్థాన్ లో కూడా ఆమెను అంతగానూ అభిమానిస్తారని ‘మామ్’ సినిమా నటుడు అద్నాన్ సిద్ధిఖీ అన్నాడు. శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె మరణ వార్త తెలిసిన అనంతరం, దుబాయ్ లో బోనీకపూర్ ని కలిశానని, చిన్న పిల్లాడిలా ఆయన ఏడుస్తున్నారని అద్నాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తనకు, సజల్ అలీకి శ్రీదేవితో, ఆమె కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. వెండితెరపై మహారాణిలా వెలిగిన శ్రీదేవిని ఎప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉందామని, శ్రీదేవి చివరి సినిమా ‘మామ్’లో ఆమెతో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న అద్నాన్ అన్నాడు. నాలుగు రోజుల క్రితం దుబాయ్ లో మోహిత్ కపూర్ వివాహానికి హాజరయ్యానని, ఇప్పుడు ఆమె లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని, శ్రీదేవి అంత్యక్రియలకు భారత్ రావాలని ఉంది కానీ, ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితులు ఇందుకు సహకరించకపోవడం దురదృష్టకరమని వాపోయాడు.

More Telugu News