Pakistan: సరిహద్దులో అప్రమత్తత... యూరీ సెక్టార్ పరిధిలో భీకర కాల్పులు!

  • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్
  • యూరీ సెక్టార్ లోని హాజీపీర్ వద్ద పాక్‌ బలగాలు కాల్పులు
  • 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత భారీ శతఘ్నులను ప్రయోగించుకున్న ఇరు దేశాలు

భారత్‌ - పాక్‌ సరిహద్దులోని యూరీ సెక్టార్‌ లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. యూరీ సెక్టార్ లోని హాజీపీర్ వద్ద పాక్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచాయి. మోర్టారు షెల్స్, శతఘ్నులను ప్రయోగించుకునేంతవరకు పరిస్థితి చేజారడంతో.. ఆదివారం తెల్లవారుజాము నుంచే మసీదుల్లోని లౌడ్‌ స్పీకర్లను వినియోగించి సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ చేయాలంటూ భారత సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.  

2003లో జరిగిన ఒప్పందం ప్రకారం ఇరు దేశాల సైన్యాలు శతఘ్నుల వినియోగాన్ని నిలిపివేయగా, సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత భారీ శతఘ్నులను ఉపయోగించి ఇరు పక్షాలు పరస్పరం దాడులుచేసుకున్నాయి. దీంతో అక్కడ నివసించే దాదాపు 8000 మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఉదయం 11.50 గంటల సమయంలో పాక్‌ సైన్యం ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఆ తరువాత సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోందని, పాక్ కాల్పులకు దీటుగా భారత సైన్యం జవాబిస్తోందని శ్రీనగర్‌ లోని రక్షణశాఖ ప్రతినిధి రాజేష్‌ ఖలియా తెలిపారు.

More Telugu News