Shravanabelagola: దటీజ్ దేవెగౌడ! 86 ఏళ్ల వయసులో 400 మెట్లు ఎక్కి ‘బాహుబలి’కి పూజలు

  • సాహసం చేసిన మాజీ ప్రధాని  
  • డోలీ ఏర్పాటు చేస్తామన్నా వినిపించుకోని జేడీఎస్ చీఫ్
  • ‘బాహుబలి’ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన వైనం

పాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ శనివారం అందరినీ ఆశ్చర్యపరిచారు. 86 ఏళ్ల వయసులో ఏకంగా 400కుపైగా మెట్లెక్కి వింధ్యగిరి కొండపై కొలువైన ‘బాహుబలి’ని సందర్శించి మొక్కు తీర్చుకున్నారు. సతీమణి చిన్నమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎనిమిదో రోజు బాహుబలిని దర్శించుకుని మహామస్తకాభిషేకంలో పాల్గొన్నారు. దేవెగౌడ మెట్లు ఎక్కి రాగా, ఆయన సతీమణి చిన్నమ్మ ‘డోలీ’లో వచ్చారు.

తాను మెట్లెక్కి వస్తానని చెప్పినప్పుడు దేవెగౌడ సిబ్బంది నిర్ఘాంతపోయారు. డోలీ ఏర్పాటు చేస్తామన్నా ఆయన వినిపించుకోలేదని అధికారులు తెలిపారు. దేవెగౌడతోపాటు తరలివచ్చిన ఆయన మద్దతుదారులు కొండ ఎక్కుతున్నప్పుడు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గౌడ కొండ ఎక్కేందుకు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది సాయం అందించారు. గతవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా నడిచే వెళ్లి బాహుబలిని దర్శించుకున్నారు. 2006లో బాహుబలిని సందర్శించినప్పుడు దేవెగౌడ, ఆయన సతీమణి చిన్నమ్మ డోలీలో వెళ్లారు. ఈసారి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ నడిచే మెట్లు ఎక్కారు.  

More Telugu News