KTR: హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ సంస్థ

  • ఫార్మా దిగ్గజాలతో కేటీఆర్ సమావేశం
  • హైదరాబాద్ నగరంలో బయోకాన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ సెంటర్
  • జినోమ్ వ్యాలీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న బయోకాన్
  • మంత్రి కేటీఆర్‌పై ఫార్మా దిగ్గజాల ప్రశంసలు
  • మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడులకు కేటీఆర్‌ అహ్వానం

బయో ఏషియా సదస్సులో భాగంగా రెండో రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫార్మా దిగ్గజాలతో సమావేశమ‌య్యారు. నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సీఈవోలు, సీనియర్ ప్రతినిధులు, థాయ్ లాండ్ వాణిజ్య ఉప మంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరల్స్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఐఐసిలో కేటీఆర్... బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షాతో సమావేశం అయ్యారు.

జినోమ్ వ్యాలీలో బయోకాన్ నూతన ఆర్అండ్‌డీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా తెలిపారు. తమ అనుబంధ కంపెనీ అయిన సింజెన్ ద్వారా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 1000 హైస్కిల్స్డ్ ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతోపాటు బయోకాన్ సిబ్బందిని రెట్టింపు చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అందిస్తామని ఆమె మంత్రికి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో మంత్రి కేటీఆర్‌ చేస్తోన్న కార్యక్రమాలకు అమె అభినందనలు తెలిపారు. ఫార్మా సిటీ ఏర్పాటు గురించి మంత్రి వివరించారు. భవిష్యత్తు విస్తరణకు ఫార్మాసిటీని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించి ప్రస్తావించిన మంత్రి, కిరణ్ మజుందార్ షా హైదరాబాద్ పర్యటనలో నగరంలోని 20 టాప్ స్టార్టప్స్ తో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నాయకత్వాన్ని కిరణ్ మజుందార్ షా అభినందించారు. మంత్రి నాయకత్వంలో దేశంలో ఎట్టకేలకు ఉన్నత ప్రమాణాలున్న సైన్స్ , ఇన్నోవేషన్ పరిశోధనలకు బీజం పడిందన్నారు. పారిశ్రామిక వేత్తలకు కేటీఆర్‌ లాంటి నాయకులను చూసినప్పుడు స్ఫూర్తి కలుగుతుందని, ఇలాంటి నాయకులను బలపర్చాలనిపిస్తుందని ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ నగరంపైన సైతం కిరణ్ మజుందార్ షా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత పురోగతి సాధించేందుకు ఆయా రంగాల్లోని నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.

అనంతరం జీఈ (సస్టెయినబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్) ప్రెసిడెంట్, సియివో టెరీ బ్రెసెన్హమ్ తో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడ్ డివైసెస్ పార్కు గురించి కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టివర్క్స్ లో జీఈ భాగస్వామి అవుతుందని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. బయో టెక్నాలజీలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరంలోని కంపెనీలు అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలపైన మంత్రి చర్చించారు.

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం సుమారు ముప్పై లక్షల ల్యాబరేటరీ స్పేస్ ఉందని ఈ సందర్భంగా మంత్రి టెరీకి తెలిపారు. త్వరలోనే జినోమ్ వ్యాలీ పర్యటనకు వస్తానని టెరీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న ఇంక్యూబేటర్ లో జీఈ భాగస్వామి కావాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన కాన్సర్ డయాగ్నస్టిక్ కార్యక్రమాలను టెరీకి మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ టాస్క్(TASK) తో కలిసి హెల్త్ కేర్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్ధంగా ఉందని తెలిపారు.

థాయ్ లాండ్ ఉప వాణిజ్య శాఖ మంత్రి చుటిమా బున్యాప్రఫసారా (Chutima Bunyapraphasara) తో కూడా కేటీఆర్‌ సమావేశం అయ్యారు. థాయ్ లాండ్ నుంచి వచ్చిన సూమారు 20 కంపెనీలతో కూడిన మంత్రి బృందం తెలంగాణలోని వ్యాపారావకాశాలపైన మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఫార్మా సిటీ, జినోమ్ వ్యాలీ, హైదరాబాద్ నగరంలో ఫార్మ, లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న అవకాశాలపైన థాయ్ లాండ్ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. థాయ్ లాండ్ దేశానికి భారతదేశం కీలకమైన వాణ్యిజ్య సంబంధాలున్న దేశమని తొలిసారి హైదరాబాద్ పర్యటనలోనే ఇక్కడి పాలసీలు, పెట్టుబడి అవకాశాలు తమను ఆకట్టుకున్నాయని చుటిమా తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ టీఎస్‌ఐపాస్ విధానాన్ని ప్రసంసించారు. భారతదేశంలో ఇటాలియన్ కాన్సుల్ జెనరల్ ఇన్ ముంబయి స్టేఫానియా కస్టాన్జా తో కూడా మంత్రి  కేటీఆర్ సమావేశమయ్యారు. టెక్స్ టైల్ రంగం, ఫార్మా, సినిమా పరిశ్రమ అనుబంధ రంగాలలో పెట్టుబడులు అవకాశాలపైన ఆలోచిస్తున్నామని కస్టాన్జా తెలిపారు. ముఖ్యంగా బయోటెక్ రంగంలో ఇటలీ దేశ ఇకో సిస్టమ్ తో ఇక్కడ కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశాలపైన అనేక కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ టెక్స్ టైల్ రంగాన్ని ఇటలీలోని అనేక ఫ్యాషన్ రంగాన్ని కలిపేందుకు ఉన్న అవకాశాలపైన ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నారు.

అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్ టైల్ రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలున్నాయని, తెలంగాణలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చే ఇటాలియన్ కంపెనీలకు అన్ని విధాలుగా సహకరిస్తామని, ఈ దిశగా అయా కంపెనీలకు తెలంగాణను పరిచయం చేయాలన్నారు. మంత్రి విజ్జప్తి మేరకు త్వరలోనే ఇటాలియన్ కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని, తెలంగాణలోని వ్యాపారావకాశాలు, పారిశ్రామిక విధానాలను తెలియజేస్తామని ఆమె మంత్రికి హామీ ఇచ్చారు. భారతదేశంలో ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి ఉన్న సవాళ్లు అనే అంశంపైన ఫార్మా కంపెనీల సీఈవోలతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

More Telugu News