marriage: పెళ్లి గిప్ట్ లో బాంబు...నాయనమ్మ, వరుడు మృతి, వధువుకు తీవ్రగాయాలు!

  • 18న సౌమ్యాశేఖర్ సాహూ, రీమా దంపతుల వివాహం
  • 21న బంధుమిత్రులకు ఘనంగా రిసెప్షన్
  • గిఫ్ట్ లు తెరుస్తుండగా పేలిన బాంబు.. ఒడిశాలో ఘటన  

అంగరంగ వైభవంగా పెళ్లి, రిసెప్షన్‌ లు జరిగిన ఇంట, చావుబాజాలు మోగిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...బోలన్‌ గిర్‌ జిల్లాలోని పట్నాఘడ్‌ గ్రామానికి చెందిన సౌమ్యశేఖర్‌ సాహూకి రీమా అనే యువతితో ఈ నెల 18వ తేదీన వివాహం జరిగింది. 21వ తేదీన ఘనంగా బంధుమిత్రులకు రిసెప్షన్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా పలువురు నూతన దంపతులకు గిఫ్ట్ లు ఇచ్చారు. రిసెప్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత శేఖర్‌ దంపతులు ఇంటికి చేరుకున్నారు. బంధుమిత్రులు ఇచ్చిన కానుకలు ఆనందంగా తెరుస్తున్నారు. ఇంతలో శేఖర్ తెరుస్తున్న గిఫ్ట్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు తీవ్రతకు అతనితో పాటు అతని నాయనమ్మ జీమా కూడా అక్కడికక్కడే మృత్యువాతపడగా, రీమా తీవ్రంగా గాయపడింది.

దీంతో కుటుంబ సభ్యులు ఆమెను బుర్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆమెను రూర్కెలా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, పేలుడుకు కారణం బాంబు అని తేల్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిందితుల కోసం రిసెప్షన్‌ లో రికార్డయిన వీడియో దృశ్యాలు పరిశీలిస్తున్నారు.

More Telugu News