Sourav Ganguly: టీ20లు లేకుంటే క్రికెట్ చచ్చిపోతుంది: గంగూలీ సంచలన వ్యాఖ్యలు

  • క్రికెట్ బతకాలంటే టీ20లు ఉండాల్సిందే
  • దక్షిణాఫ్రికాలో టీమిండియా ప్రదర్శన సూపర్
  • ధోనీ ఆడడాన్ని గౌరవంగా భావించాలంతే: గంగూలీ

టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పొట్టి క్రికెట్ టీ20 లేకుంటే క్రికెట్ బతికిబట్టకట్టడం అసాధ్యమని పేర్కొన్నాడు. ఓ ప్రశ్నకు సమాధానంగా గంగూలీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ బతకాలంటే టీ20లు తప్పనిసరి అని, అది లేకుంటే క్రికెట్‌కు భవిష్యత్ లేదని తేల్చిచెప్పాడు. దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టు ప్రదర్శనపై ‘దాదా’ సంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్‌లో వారు చాలా బాగా ఆడారని కితాబిచ్చాడు.

ఇక నేడు జరగనున్న చివరి టీ20ని గెలుచుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న మనీష్ పాండే, హార్ధిక్ పాండ్యా లాంటి యువ ఆటగాళ్లు ఎదగడానికి సమయం ఇవ్వాలని గంగూలీ పేర్కొన్నాడు. వన్డే, టీ20ల్లో ధోనీ చక్కగా ఆడుతున్నాడని, అయితే మునుపటి ధోనీని చూడడం ఇక కష్టమేనని తేల్చి చెప్పాడు. ధోనీ ఆడడాన్ని గౌరవంగా మాత్రమే చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. మహిళా క్రికెటర్లతో పోల్చినప్పుడు పురుషుల జట్టే మెరుగైనదని గంగూలీ స్పష్టం చేశాడు.

More Telugu News