Airtel: టెలికం రంగంలో సరికొత్త అధ్యాయం: భారత్‌లో 5జీ ట్రయల్ సక్సెస్.. సెకనుకు 3జీబీ డేటా!

  • చైనా మొబైల్ మేకర్ హువేయితో చేతులు కలిపిన ఎయిర్‌టెల్ 
  • మనేసర్‌లో నిర్వహించిన 5జీ నెట్‌వర్క్ ట్రయల్ విజయవంతం
  • ఇక 5జీ నెట్‌వర్క్ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్‌టెల్

టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, చైనా టెలికం ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్ సంస్థ హువేయి కలిసి భారత్‌లో నిర్వహించిన 5 జీ నెట్‌వర్క్ ట్రయల్ విజయవంతమైంది. ఈ మేరకు ఈ రెండు సంస్థలు శుక్రవారం సంయుక్తంగా వెల్లడించాయి. 5జీ ట్రయల్ విజయవంతం అయిందని, సెకనుకు 3జీబీ డేటా వేగాన్ని అందుకున్నట్టు పేర్కొన్నాయి. 5జీ కోసం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ ఏటీ, ఆ సంస్థ భారత భాగస్వామి విర్గో కార్పొరేషన్‌తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. అందులోనే ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షించి విజయం సాధించినట్టు పేర్కొనడం గమనార్హం.

గురుగ్రామ్‌లోని మనేసర్‌లో ఉన్న ఎయిర్‌‌టెల్ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ట్రయల్ నిర్వహించినట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. టెస్ట్ విజయవంతం కావడంతో త్వరలోనే భారత్‌లో 5జీ ఈకో సిస్టం అభివృద్ధికి చర్యలు ప్రారంభిస్తామని భారతీ ఎయిర్‌టెల్ డైరెక్టర్ (నెట్‌వర్క్స్) అభయ్ సావర్గోవంకర్ తెలిపారు.

More Telugu News