Virtual Print Fee: సినీ ప్రియులకు చేదువార్త... మార్చి 2 నుంచి సినిమాల ప్రదర్శన బంద్..!

  • రేటు తగ్గింపుపై డీఎస్‌పీలతో చర్చలు విఫలం
  • వీపీఎఫ్ తగ్గింపుకు ససేమిరా అన్న డీఎస్‌పీలు
  • డైలమాలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి

సినీ ప్రియులకు ఇది తప్పకుండా చేదువార్తే అవుతుంది. ఎందుకంటే, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (డీఎస్‌పీలు) క్యూబ్, యూఎఫ్‌ఓ సంస్థల ప్రతినిధులతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ నిర్మాతల ఐకాస శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ సమావేశం బెంగళూరులోని ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. చర్చలు విఫలం కావడంతో మార్చి 2 నుంచి దక్షిణాదిలో సినిమాల ప్రదర్శన నిలిపివేతకు నిర్మాతలు, పంపిణీదారులు నిర్ణయించారు. సినిమాల ప్రదర్శనకు క్యూబ్, యూఎఫ్ఓ అధిక ధరలు వసూలు చేస్తున్నాయనే అంశంపై ఈ భేటీలో చర్చించారు. ధరలు తగ్గించాలని నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని క్యూబ్, యూఎఫ్ఓ ప్రతినిధులు అంగీకరించలేదు. దీంతో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయించారు.

ఇదే గనుక జరిగితే ఇప్పటికే రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్‌ సినిమాలు విడుదల కాని పరిస్థితి నెలకొంది. వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్) విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. దక్షిణాది సినిమా థియేటర్లలో ఓ ప్రాంతీయ సినిమా ప్రదర్శనకు ఒక్కో స్క్రీన్‌కు సుమారు రూ.22500 వరకు వీపీఎఫ్‌ను డీఎస్‌పీలు వసూలు చేస్తున్నాయి. ఇది నిర్మాతలకు భారంగా మారుతోంది. అందువల్ల ఈ రేటును సగానికి తగ్గించాలనేది నిర్మాతల మండలి ప్రధాన డిమాండ్. కానీ వారి డిమాండ్‌కు డీఎస్‌పీలు తలొగ్గకపోవడంతో మార్చి 2 నుంచి దక్షిణాది సినిమాల ప్రదర్శన నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.

More Telugu News