hall ticket: ఏపీ ఇంటర్‌ పరీక్షలకు 10.26 లక్షల మంది.. ఫీజు పేరుతో హాల్ టికెట్ ఆపితే చర్యలు!

  •  ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు
  •  ఈ ఏడాది నుంచి గ్రేడ్ విధానం
  •  పరీక్షా కేంద్రం తెలుసుకోవడం కోసం నూతన యాప్
  •  కాపీ కొడితే 8 పరీక్షల వరకు డిబార్
  •  సమస్యలు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నెంబర్: 18002749868

ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఇంటర్ బోర్డు కమిషనర్ బి.ఉదయలక్ష్మి చెప్పారు. అమ‌రావ‌తిలోని సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈ రోజు మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 10,26,891 మంది పరీక్షల‌కు హాజరవుతారన్నారు.

పరీక్షలు ప్ర‌తిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాల‌కి చేరుకోవాల‌ని అన్నారు. నేటి నుంచి హాల్ టికెట్లను jnanabhumi.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ను సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ తో ధ్రువీకరించాలని, దానిని తీసుకొని పరీక్షా కేంద్రానికి వెళ్లాలని వివరించారు.

ఫీజులు చెల్లించలేదన్న పేరుతో విద్యార్థుల హాల్ టికెట్లను ధ్రువీకరించని ప్రైవేటు కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హత ఉన్న విద్యార్థులందరికీ హాల్ టికెట్లు ధ్రువీకరించాలని ఆమె చెప్పారు. విద్యార్థులు చదువుకునే కాలేజీ కాకుండా జంబ్లింగ్ విధానంలో మరో కాలేజీని పరీక్షా కేంద్రంగా నిర్ణయించినందున, వాళ్లు పరీక్షా కేంద్రాలను తెలుసుకోవడానికి ఇబ్బందిపడకుండా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్ లొకేటర్ అనే నూతన యాప్ ను రూపొందించినట్లు తెలిపారు.

యాండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే, అది కోడ్ నెంబర్ అడుగుతుందని, ఆ స్థానంలో విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పరీక్షా కేంద్రాన్ని చూపుతుందని వివరించారు. యాండ్రాయిడ్ సెల్ ఫోన్ లేనివారు ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. పరీక్ష రోజు ఉదయం కేంద్రాన్ని వెతుక్కోవడానికి ఎక్కవ సమయం కేటాయించకుండా, హడావుడి లేకుండా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలన్నారు.

కాపీ చేస్తూ పట్టుబడితే 8 పరీక్షల వరకు డిబార్‌..

మొత్తం 1423 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాటిలో 116 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. కాపీయింగ్ జరుగకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాపీ చేస్తూ పట్టుబడితే విద్యార్థిని 8 పరీక్షల వరకు డిబార్ చేస్తామన్నారు. విద్యార్థులు కాపీ చేసే అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద, అవకాశం ఉన్న మేరకు ప్రతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమని, సమస్యాత్మక కేంద్రాలలో తప్పనిసరిగా ప్రతి గదిలో ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

థియరీ పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి పది పరీక్షా కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ని, సమస్యాత్మక కేంద్రాల్లో ప్రతి కేంద్రానికి ఒక సిటింగ్ స్క్వాడ్ ని నియమించినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చొని పరీక్ష రాసే పరిస్థితి లేకుండా, అందరికి కుర్చీలు గానీ, బెంచీలు గాని తప్పనిసరిగా ఏర్పాటు చేయమని లేకపోతే అద్దెకు తీసుకొని ఏర్పాటు చేయమని ఆదేశించినట్లు తెలిపారు.

ప్రతి రోజూ లాటరీ పద్ధ‌తిలో ఇన్విజిలేటర్లను ఎంపిక చేస్తారని చెప్పారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే విజయవాడ ఇంటర్ బోర్డులోని ఫోన్ నెంబర్ 0866-2974130, ఫాక్స్ నెంబర్ 0866-2970056, టోల్ ఫ్రీ నెంబర్ 18002749868కు తెలియజేయమన్నారు. పరీక్షలు సమర్థ‌వంతంగా నిర్వహించడం కోసం ఆయా జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎండలో వచ్చిన విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ప్రతి సెంటర్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో ఒక నర్సుని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం పరీక్ష సమయానికి ఓ గంట ముందే కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని, కాపీయింగ్ జరుగకుండా ప్రతి కేంద్రం సమీపంలోని ఫొటోస్టాట్ సెంటర్లను మూయిస్తున్నామని, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతోపాటు ఒక పోలీస్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సహకరించవలసిందిగా ఆయా జిల్లా కలెక్టర్లను, పోలీస్, వైద్య ఆరోగ్యం శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, ఆర్టీసీ అధికారులకు కోరినట్లు చెప్పారు.

ఇంటర్ బోర్డు తరపున నాలుగు వేల మంది అధికారులు పని చేస్తున్నారని, వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోమని ఆదేశించినట్లు తెలిపారు. కొంతమంది కావాలని పేపర్ లీకైనట్లు వదంతులు సృష్టించే అవకాశం ఉందని, అటువంటివాటిని నమ్మవద్దని చెప్పారు. ఒక వేళ నిజంగా లీకైతే విచారణ జరిపి, నిజానిజాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు సెల్ ఫోన్ తీసుకువెళ్లకుండా నిషేధించినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశ్నాపత్రంపై ఉండే నియమ నిబంధనలు తప్పనిసరిగా చదువుకొని, పరీక్ష రాయడం మొదలుపెట్టాలన్నారు. ఈ ఏడాది ర్యాంకింగ్ లు ఇవ్వడంలేదని, గ్రేడ్ విధానం ప్రవేశపెడుతున్నట్లు ఆమె చెప్పారు.

స్పాట్ వాల్యూషన్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు

పరీక్షలు ముగిసిన తరువాత స్పాట్ వాల్యూషన్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉదయలక్ష్మి తెలిపారు. పేపర్లు దిద్దే అధ్యాపకులకు రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తామని, వారు దిద్దడంలో అశ్రద్ధ చూపకుండా, తరచూ బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సంస్కృతం పేపర్లు దిద్దడానికి ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను తప్పనిసరిగా పంపించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పాట్ వాల్యూషన్ కు వచ్చిన అధ్యాపకులకు వారి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా నగదు రహిత చెల్లింపులు అంటే వారి బ్యాంకు ఖాతాలో టీఏ, డీఏలు జమ అవుతాయని ఉదయలక్ష్మి చెప్పారు.

More Telugu News