Mumbai: స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తరువాత తొలిసారి కరెంటును చూసిన చారిత్రక ప్రదేశం!

  • ఎలిఫెంటా గుహలకు కరెంటు
  • సముద్ర గర్భంలో 7.5 కి.మీ పొడవైన లైన్
  • చారిత్రాత్మక దినమన్న మహారాష్ట్ర మంత్రి

ఎలిఫెంటా గుహలు... దేశ ఆర్థిక రాజధాని ముంబైకి సమీపంలో ఉన్న ప్రపంచ వారసత్వ సంపద. ముంబై తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘరాపురీ ద్వీపంలో ఉన్న ఎలిఫెంటా గుహలకు స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తరువాత తొలిసారిగా కరెంట్ సౌకర్యం దగ్గరైంది. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి సముద్రగర్భంగా 7.5 కి.మీ. పొడవైన కేబుల్ ను వేయడం ద్వారా ఈ దీవికి కరెంటు సరఫరా తొలిసారిగా జరిగింది.

ఇదో చారిత్రాత్మక రోజని, అరేబియా సముద్రంలోని మిగతా చిన్న దీవులకూ ఇదే సదుపాయాన్ని దగ్గర చేస్తామని రాష్ట్ర ఇంధన, ప్రత్యామ్నాయ ఇంధన శాఖల మంత్రి చంద్రశేఖర్ బవాంకులే వ్యాఖ్యానించారు. ఇకపై ఎలిఫెంటా గుహలు మరింత మంది టూరిస్టులను ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఘరాపురీ దీవిలోని రాజ్ బందర్ మోరా బందర్, షేత్ బందర్ గ్రామాల్లోని అన్ని ఇళ్లకు కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామని అన్నారు. కాగా, ఈ ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా జనరేటర్లతో విద్యుత్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. మూడు గ్రామాల్లో కలిపి దాదాపు 950 మంది నివసిస్తుండగా, వీరందరికీ గుహల సందర్శనకు వచ్చే టూరిస్టుల ద్వారా లభించే ఆదాయమే జీవనమార్గం.

More Telugu News