Vijayawada: చంద్రబాబు చెప్పిన మాటలేగా నేనూ చెబుతున్నది: సోము వీర్రాజు దెప్పిపొడుపు!

  • హోదాతో ఒరిగేదేమీ లేదని చంద్రబాబు అనలేదా?
  • హోదాతో వచ్చేది రూ. 3 వేల కోట్లేనని చెప్పలేదా?
  • అవే మాటలు తాను చెబుతుంటే విమర్శలు ఎందుకు
  • విజయవాడలో మీడియా సమావేశంలో సోము

ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ఆనాడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలనే తానిప్పుడు చెబుతున్నానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు, ఆ మాటెత్తితే జైలుకు పంపుతానని అనలేదా? అని ప్రశ్నించారు.

 ఈ ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, హోదా వస్తే రూ. 3 వేల కోట్ల మేరకు మాత్రమే లబ్ధి కలుగుతుందని చంద్రబాబు స్వయంగా చెప్పారని గుర్తు చేస్తూ, అప్పట్లో హోదా ఉన్న రాష్ట్రాలకన్నా ఏపీకే ఎక్కువ వచ్చాయని కూడా చంద్రబాబు అన్నారని, ఇప్పుడు తాను అవే మాటలు చెబుతుంటే విమర్శిస్తున్నారని దెప్పిపొడిచారు.

ఎందుకు మాట మారుస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించలేని తెలుగుదేశం నేతలు, ఇప్పుడు తనపై విరుచుకుపడుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ సకాలంలోనే వచ్చాయని, వస్తున్నాయని, అయినా ఇప్పుడు కావాలనే బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.

More Telugu News