Syekh Yusuf Hospital: గుడ్లు పెడుతున్న ఇండోనేషియా బాలుడు.. షాక్ అవుతున్న వైద్యులు!

  • రెండేళ్లలో 20 గుడ్లు పెట్టిన బాలుడు
  • ఇది అసాధ్యమంటోన్న వైద్యులు
  • వైద్యుల కళ్లెదుటే రెండు గుడ్లు పెట్టిన వైనం
  • కారణాలను అన్వేషించే పనిలో డాక్టర్లు

ఇప్పటివరకు పక్షులు, పాములు లాంటివే గుడ్లు పెడతాయని మనకు తెలుసు. కానీ, ఇండోనేషియాలో ఓ 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతూ అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. గత రెండేళ్లలో అతను మొత్తం 20 గుడ్లు పెట్టాడు. ఈ విషయం వినగానే వైద్యులు షాక్ అవుతున్నారు. వివరాల్లోకెళితే, ఇండోనేషియాలోని గోవా ప్రాంతానికి చెందిన అక్మాల్ 2016 నుంచి తాను క్రమం తప్పకుండా గుడ్లు పెడుతున్నట్లు చెబుతున్నాడు.

తన కుమారుడు పెడుతున్న గుడ్లు మొత్తం పచ్చ సొనగా గానీ లేదా మొత్తం తెలుపు గుడ్డుగా గానీ ఉంటున్నాయని అక్మాల్ తండ్రి రుస్లీ తెలిపాడు. ఇలా చిత్రమైన రీతిలో గుడ్లు పెడుతుండటంతో అక్మాల్‌‌ని వైద్య పరీక్షల నిమిత్తం తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్లినపుడు వైద్యుల కళ్లెదుటే అతను రెండు గుడ్లు పెట్టాడని ఆయన తెలిపాడు.

"రెండేళ్లలో నా కుమారుడు 18 గుడ్లు పెట్టాడు. ఈ రోజు కూడా రెండు గుడ్లు పెట్టాడు. అంటే, మొత్తం 20 గుడ్లు పెట్టాడు. మొదటి గుడ్డును నేను పగలగొట్టి చూశాను. అందులో మొత్తం పచ్చసొన తప్ప తెలుపు రంగు పదార్థం ఏమీ లేదు" అని రుస్లీ చెప్పాడు. ఈ పరిస్థితిని కళ్లారా చూసిన వైద్యులు ఈ రకంగా ఓ మనిషి కడుపులో గుడ్లు తయారు కావడం అసాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు డైలీ స్టార్ పత్రిక ఉటంకించింది.

 ఆసుపత్రి ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ...గుడ్లను ఉద్దేశపూర్వకంగానే అక్మల్ పురీషనాళంలోకి చొప్పిస్తున్నారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కానీ, అలాంటిదేమీ లేదంటూ రుస్లీ కొట్టిపారేశారు. ప్రస్తుతం గోవాలోని షేక్ యూసుఫ్ ఆసుపత్రిలో వైద్యులు అక్మాల్ చిత్రమైన పరిస్థితికి గల కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు.

More Telugu News