Suicide: ట్విస్ట్! ఆత్మహత్య చేసుకున్నది భార్యాభర్తలు కాదు.. బావా మరదళ్లు!

  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • పరువు పోయిందని రైలు కింద పడి ఆత్మహత్య
  • అనాథగా ఐదేళ్ల చిన్నారి

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కుమార్తెను ప్లాట్‌ఫామ్‌పై వదిలిపెట్టి వీరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే, తాజాగా ఈ కేసులో ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. చనిపోయింది భార్యాభర్తలు కాదని, బావామరదళ్లు అని తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డిలోని పద్మాజీవాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం (35) వరుసకు మరదలైన దేవేంద్ర (30) మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. దేవేంద్ర భర్త రఘు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లగా ఐదేళ్ల బాబుతో ఆమె స్వగ్రామంలోనే ఉంటోంది. ఇక, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య నుంచి విడాకులు తీసుకున్న కాశీరాం.. దేవేంద్రతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

కాశీరాం-దేవేంద్ర విషయం ఇరు కుటుంబాల వారికి తెలియడంతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో కులపెద్దలు పంచాయితీ నిర్వహించి కాశీరాంకు రూ.3 లక్షల జరిమానా విధించారు. తన భార్య అక్రమ సంబంధం గురించి తెలియడంతో దుబాయ్‌లో ఉంటున్న రఘు తనకు ఇక దేవేంద్ర వద్దని కులపెద్దలతో చెప్పినట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధం బయటపడడం, ఊర్లో తలెత్తుకోలేకుండా అయిపోవడంతో దేవేంద్ర-కాశీరాంలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. దేవేంద్ర తన ఐదేళ్ల కుమారుడిని ప్లాట్‌ఫాంపై వదిలేసింది. అనంతరం ఇద్దరూ కలిసి రైలు కింద తలపెట్టి ప్రాణాలు తీసుకున్నారు.  

More Telugu News