nirav modi: నీరవ్ మోదీని చెప్పుతో కొడతా: 'ఫైర్ స్టార్ గ్రూప్' సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్ భార్య

  • ఫైర్ స్టార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ ను అరెస్ట్ చేసిన సీబీఐ
  • తన భర్త నిజాయతీపరుడన్న అర్జున్ భార్య
  • ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటూ కన్నీటిపర్యంతం

పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణం నేపథ్యంలో గీతాంజలి జెమ్స్ కు చెందిన పలువురు అధికారులతో పాటు, నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ లను సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సీబీఐ సెషన్స్ కోర్టు ముందు వీరిని హాజరుపరచగా... మార్చి 5వ తేదీ వరకు పోలీసు కస్టడీకి ఇస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైర్ స్టార్ గ్రూపుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్ భార్య సుజాత పాటిల్ నీరవ్ మోదీపై నిప్పులు చెరిగారు.

నీరవ్ మోదీ విదేశాల నుంచి తిరిగి భారత్ కు వస్తే... చెప్పుతో కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెషన్స్ కోర్టు వెలుపల ఆమె మాట్లాడుతూ, ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త అర్జున్ నిజాయతీపరుడని, నెలకు రూ. 30 వేలు మాత్రమే సంపాదిస్తారని... ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోరని చెప్పారు. ఆఫీసులో ఏది చెబితే అది మాత్రమే చేస్తారని... ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. అమాయకుడైన తన భర్తను అనవసరంగా అరెస్ట్ చేశారని కన్నీటిపర్యంతం అయ్యారు. తమ ఇంట్లో సీబీఐ జరిపిన సోదాల్లో కూడా ఏమీ దొరకలేదని అన్నారు.

More Telugu News