flats buy: నాలుగు ఫ్లాట్ల వెల రూ.240 కోట్లు... ముంబైలో తపారియా కుటుంబ సభ్యుల భారీ కొనుగోలు

  • 1చ.అడుగు ధర రూ. 1.2 లక్షలు
  • ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద డీల్
  • గతంలో పూనవాలా రూ.750 కోట్లతో అతిపెద్ద కొనుగోలు

ముంబైలో మరోసారి అత్యంత ఖరీదైన నివాస భవనాల కొనుగోలు డీల్ జరిగింది. ముంబైలో నెపన్సీ రోడ్డులో త్వరలోనే పూర్తి కానున్న భారీ రెసిడెన్షియల్ టవర్ (నివాస సముదాయం)లో నాలుగు ఫ్లాట్లను రూ.240 కోట్లు పెట్టి తపారియా కుటుంబం కొనుగోలు చేసింది. రున్వాల్ గ్రూపు నుంచి గత నెల 28-31 తేదీల మధ్య ఈ కొనుగోలు జరిగినట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు తెలిపాయి. ఈ ఫ్లాట్లలో ఒక చదరపు అడుగు ధర రూ. 1.2లక్షలు. ఈ నివాస సముదాయం కిలాచంద్ హౌస్ సమీపంలో నిర్మాణం జరుగుతోంది. తపారియాలు మూడేళ్ల క్రితమే ఫామీకేర్ అనే కంపెనీని (మహిళల ఆరోగ్య విభాగంలో ఉత్పత్తుల తయారు చేసేది) రూ.4,600 కోట్లకు విక్రయించారు. ముంబైలో అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తులు వీరు.

గతంలో పెద్ద డీల్స్

  • 2015లో పారిశ్రామిక వేత్త సైరస్ పూనవాలా రూ.750 కోట్లతో బ్రీచ్ క్యాండీ వద్ద ఓ ప్యాలెస్ కొన్నారు. ఇది దేశంలోనే అత్యధిక విలువైన వ్యక్తిగత కొనుగోలు.
  • 2015లో జిందాల్ కుటుంబం రూ.160 కోట్లతో లోధా ఆల్టామౌంట్ నివాస ప్రాజెక్టులో 10,000 చదరపు అడుగులతో ఉన్న డూప్లెక్స్ ను కొనుగోలు చేశారు.
  • 2015లోనే పత్ని కంప్యూటర్స్ యజమాని నెపియా సీ రోడ్డులో రన్ వాల్స్ రెసిడెన్స్ లో మూడు ఫ్లోర్లను కొనుగోలు చేశారు.

More Telugu News