serena williams: అమ్మో.. తలచుకుంటేనే భయంగా వుంది.. చావు అంచుల వరకు వెళ్లొచ్చా!: సెరీనా విలియమ్స్

  • ప్రసవం తర్వాత ఊపిరితిత్తుల్లో గడ్డకట్టిన రక్తం
  • ఆరు రోజులు మరణంతో పోరాడిన సెరెనా
  • గతంలో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్న టెన్నిస్ స్టార్

తన ముద్దుల కూతురు ఒలింపియాతో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సంతోషంగా గడుపుతోంది. బిడ్డకు జన్మనివ్వడం కోసం దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన ఆమె... ప్రసవం సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఓ దశలో ఆమె బతకడం కూడా అసాధ్యమనే చెప్పారు. గుండె దడ విపరీతంగా పెరిగిపోవడంతో... ఆమెకు అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్ ను నిర్వహించి, బిడ్డను బయటకు తీశారు.

ఆ ఆపరేషన్ విజయవంతం అయినప్పటికీ... ఆమె ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టింది. ఆ తర్వాత ఆమె చాలా సమస్యలు ఎదుర్కొంది. దీనిపై సెరెనా స్పందిస్తూ, ఒలింపియాకు జన్మనిచ్చిన తర్వాత... చావు అంచుల వరకు వెళ్లొచ్చానని చెప్పింది. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడానని తెలిపింది.

2001లో కూడా ఇలాంటి సమస్యనే సెరెనా ఎదుర్కొంది. ఓ రెస్టారెంట్ లో అద్దం పగిలి, ఓ గాజు ముక్క ఎగిరివచ్చి ఆమె కాలికి తగిలింది. దీంతో, ఆ ప్రాంతంలో ఆమెకు రక్తం గడ్డకట్టుకుపోయింది. అప్పుడు కూడా దాదాపు ఏడాది పాటు ఆమె ఆటకు దూరం కావాల్సి వచ్చింది. తన వైద్య చరిత్ర ప్రకారం... ఈ రక్తం గడ్డకట్టుకుపోయే సమస్యతో ఎప్పుడు ప్రాణం పోతుందోనని భయపడుతూ ఉండేదాన్నని సెరెనా తెలిపింది.

More Telugu News