narendra modi: ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసు .. ప్రధాని మోదీకి మారిషస్ ప్రభుత్వం నోటీసులు

  • నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించిన మారిషస్  
  • ఈ మేరకు ప్రధాని మోదీ కీ నోటీసులు
  • తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా కార్పొరేషన్ కు ఓ లేఖ రాసిన మారిషస్ ప్రభుత్వం

జగన్ అక్రమాస్తుల కేసులో భారత ప్రభుత్వాన్ని అంతర్జాతీయ కోర్టుకు మారిషస్ ప్రభుత్వం లాగింది. ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసుతో తాము భారీగా నష్టపోయామని, న్యాయం చేయాలని కోరుతూ మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ కోర్టుకు విన్నవించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా  కేంద్ర ఆర్థిక, వాణిజ్య పన్నులు, న్యాయ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు నోటీసులు జారీ చేసింది. తమ పెట్టుబడులకు విఘాతం కలిగిందని పేర్కొంటూ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా కార్పొరేషన్ కు మారిషస్ ప్రభుత్వం ఓ లేఖ రాయడంతో పాటు మోదీకి లీగల్ నోటీసులు జారీ చేసింది.

తాము భారీగా నష్టపోయామని, 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని మారిషస్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో మోదీకి నోటీసులు పంపడమే కాకుండా, కేంద్ర ఆర్థిక, వాణిజ్య పన్నులు, న్యాయ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను ప్రతివాదులు గా చేర్చింది.  కాగా, ప్రధాని మోదీకి నోటీసులు రావడంతో కేంద్ర మంత్రులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

మారిషస్  ప్రభుత్వం నోటీసుల పంపిన మాట వాస్తవమే: తెలంగాణ ప్రభుత్వం


మారిషస్ ప్రభుత్వం నోటీసులు పంపిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ధ్రువీకరించింది. సీబీఐ కేసులు, ఈడీ కేసులు పెండింగ్ లో ఉన్నందున తమ పెట్టుబడుల ఒప్పందానికి రక్షణ లేకుండా పోయిందని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు ప్రభుత్వ అధికారుల సమాచారం.

కాగా, ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసులో జగన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహా పలువురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందూ సెజ్ లో శ్యాం ప్రసాద్ రెడ్డి, మారిషస్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ సెజ్ లో మారిషస్ కు 49 శాతం వాటా ఉంది. ఇందూ టెక్ లో మారిషస్ కు చెందిన కరీసా ఇన్వెస్ట్ మెంట్స్ మొత్తం రూ.115 కోట్లు పెట్టుబడులు పెట్టింది. సీబీఐ కేసు కారణంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

More Telugu News