Mumbai: సంచలనం... ముంబైలో జస్టిన్ ట్రూడోను కలసి డిన్నర్ చేసిన ఖలిస్థాన్ ఉగ్రవాది!

  • ఇండియాలో కొనసాగుతున్న ట్రూడో పర్యటన
  • కెనడా ప్రధాని విందుకు ఖలిస్థాన్ ఉగ్రవాది
  • ట్రూడో భార్యతో ఫొటోలు
  • కొత్త వివాదానికి తెర లేపిన విందు

ఇండియాలో వారం రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ముంబైలో ఉన్న వేళ, ఓ పెద్ద వివాదం చెలరేగింది. ఖలిస్థాన్ ఉగ్రవాదిగా ముద్రపడ్డ జస్పాల్ అత్వాల్ ముంబైలో జరిగిన ట్రూడో డిన్నర్ ఈవెంట్ కు హాజరయ్యాడు. అంతేకాదు, కెనడా ప్రధాని సతీమణి సోఫీ ట్రూడోతో కలసి ఫొటోలు దిగాడు. కెనడా మౌలిక వనరుల శాఖా మంత్రి అమర్ జీత్ సోహీతో కలసి చర్చించారు. ట్రూడో, అతని కుటుంబంతో కలసి డిన్నర్ చేయాలని ఫిబ్రవరి 22న ఆయనకు ఆహ్వానం వెళ్లిందని, ఇది భారత్ లో కెనడా దౌత్యాధికారి నాదిర్ పటేల్ పేరిట వెళ్లిందని తెలుస్తుండగా, ఆ తరువాత ఆహ్వానాన్ని రద్దు చేసుకున్నప్పటికీ జస్పాల్ ఈ కార్యక్రమానికి వచ్చేశారని అధికారులు అంటున్నారు.

కాగా, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ లో సభ్యుడైన జస్పాల్ అత్వాల్ 1986లో వాంకోవర్ లో మాజీ ఇండియన్ మినిస్టర్ మల్కియత్ సింగ్ సిద్ధూ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపిన వ్యక్తి. ఆ తరువాత సిక్ యూత్ ఫెడరేషన్ ను నిషేధించడంతో పాటు అత్వాల్ పై ఉగ్రవాది ముద్ర కూడా పడింది. ఇప్పుడాయన ట్రూడోతో కలవడం సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే ఆగ్రాలోని తాజ్ మహల్, గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమం, అమృతసర్ లోని స్వర్ణ దేవాలయం తదితర ప్రాంతాలను సందర్శించిన ఆయన, మరో రెండు రోజుల్లో తన పర్యటనను ముగించుకోనున్నారు.

More Telugu News