MS Dhoni: 11 ఏళ్ల టీ20 కెరీర్‌లో ధోనీ చేసిన అర్ధ సెంచరీలు ఎన్నో తెలుసా?

  • సెంచూరియన్ మ్యాచ్‌లో చెలరేగిన ధోనీ
  • 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ
  • 77వ ఇన్నింగ్స్‌లో రెండో అర్ధ సెంచరీ

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ తన 11 ఏళ్ల టీ20 కెరీర్‌లో చేసిన అర్ధ సెంచరీలు ఎన్నో తెలుసా? కేవలం రెండే. టీ20ల్లో తొలి అర్ధ సెంచరీ చేయడానికి 65 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ గత 12 ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధ సెంచరీలు నమోదు చేయడం గమనార్హం.

బుధవారం దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ20లో ధోనీ చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 52 పరుగులు చేశాడు. ధోనీకి ఇది 77వ టీ20 ఇన్నింగ్స్.

కాగా, సెంచూరియన్ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది. సిరీస్ విజయాన్ని తేల్చే చివరి మ్యాచ్ శనివారం కేప్‌టౌన్‌లో జరగనుంది.

More Telugu News