Telecom: 4జీ స్పీడు భారత్‌లో దారుణాతి దారుణం.. ప్రపంచంలోనే అతి తక్కువ!

  • 6 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్ వేగంతో పాకిస్థాన్ కంటే వెనక
  • 44 ఎంబీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో సింగపూర్
  • పెరుగుతున్న యూజర్లకు అనుగుణంగా నెట్‌వర్క్‌ను విస్తరించుకోకపోవడమే కారణం

డిజిటల్ ఇండియా అని ఎంతగా ఊదరగొడుతున్నా 4జీ స్పీడ్‌ భారత్‌లో దారుణంగా ఉందని మొబైల్ అనలిటిక్స్ కంపెనీ ఓపెన్ సిగ్నల్ పేర్కొంది. దేశంలోని టెల్కోలు 4జీ సర్వీసులు అందిస్తున్నా స్పీడ్ విషయంలో పోటీపడుతున్నా వేగం మాత్రం అంతంతమాత్రమేనని తేల్చి చెప్పింది. పాకిస్థాన్, అల్జీరియా, కజకిస్థాన్, ట్యునీషియా కంటే కూడా ఈ విషయంలో వెనుకబడి ఉందని పేర్కొంది.

ప్రపంచంలోని 88 దేశాలతో పోల్చితే భారత్‌లో 4జీ డౌన్‌లోడ్ వేగం దారుణంగా ఉందని పేర్కొంది. భారత్‌లో సగటు 4జీ స్పీడ్ 6 ఎంబీపీస్ మాత్రమేనని తెలిపింది. అదే సమయంలో పాకిస్థాన్‌లో 4జీ స్పీడ్ 14 ఎంబీపీఎస్‌గా ఉందని వివరించింది. చివరికి అల్జీరియాలోనూ 9 ఎంబీపీఎస్ ఉందని తెలిపింది.

44 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో సింగపూర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, 42 ఎంబీపీఎస్‌తో నెదర్లాండ్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో నార్వే (41), దక్షిణ కొరియా (40), హంగేరీ (39) ఉన్నాయి. ప్రముఖ నెట్‌వర్క్ కంపెనీలు ఉండి కూడా 4జీ స్పీడ్‌లో వెనకబడిన దేశాల్లో భారత్ 6 ఎంబీపీఎస్‌తో భారత్ అట్టడుగున ఉండగా, పాకిస్థాన్ 14 ఎంబీపీఎస్‌తో భారత్ కంటే పైన ఉంది. దేశంలో పెరుగుతున్న 4జీ వినియోగదారులకు అనుగుణంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోకపోవడమే ఇందుకు కారణమని ‘ఓపెన్ సిగ్నల్’ పేర్కొంది.

More Telugu News