panchayat: ఏళ్ల నాటి సంప్రదాయానికి తెర.. మహిళలు మేలి ముసుగును వేసుకునే అవసరంలేదని పంచాయతీ నిర్ణయం

  • మహిళలు ఇక మీదట బయటకు వచ్చినపుడు మేలి ముసుగును ధరించాల్సిన అవసరం లేదు
  • ఇలా ముసుగు ధరించడం అనేది అవివేకం
  • ఇటువంటి ముసుగువల్ల మహిళలు చూసేందుకు ఇబ్బందులు
  • శ్వాస తీసుకోవడంలోను ఇబ్బందులు పడుతున్నారు-పంచాయతీ చీఫ్

పంచాయతీల పెద్దలు ఇచ్చే తీర్పులు చెల్లవని ఇటీవలే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పలు పంచాయతీలు తాము ఎంతో కాలంగా పాటిస్తోన్న సంప్రదాయాల విషయంలో వెనక్కు తగ్గుతున్నాయి. హరియాణాలోని అతిపెద్ద ఖాప్‌ పంచాయతీ.. మాలిక్‌ గథ్వాలా ఖాప్ తాజాగా చేసిన ఓ ప్రకటన పంచాయతీల్లో వస్తోన్న మార్పును సూచిస్తోంది.

సోనెపత్‌లోని ఘోఘన ప్రాంతంలో ఖాప్‌ పంచాయతీ చీఫ్‌ బల్జీత్‌ మాలిక్ తాజాగా మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా పాటిస్తోన్న సంప్రదాయానికి ముగింపు పలికాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మహిళలు ఇక మీదట బయటకు వచ్చినపుడు మేలి ముసుగును ధరించాల్సిన అవసరం లేదని ప్రకటన చేశారు. మహిళలు ఇలా ముసుగు ధరించడం అనేది అవివేకం అని కూడా ఆయన అనడం గమనార్హం.

ఇటువంటి ముసుగువల్ల మహిళలు చూసేందుకు ఇబ్బందులు పడుతున్నారని, శ్వాస తీసుకోవడంలోను ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆయన అన్నారు. అందుకే తాము దీన్ని నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. పెద్ద వాళ్లను గౌరవించేందుకు సూచకంగా మహిళలు తలపై కేవలం స్కార్ఫ్‌ ధరిస్తే చాలని తెలిపారు. ఈ నిర్ణయంపై అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.     

More Telugu News