dawood ibrahim: హైదరాబాదులో సెలబ్రిటీని లేపేసేందుకు 45 లక్షల సుపారీ ఆఫర్ చేసిన దావూద్ గ్యాంగ్!

  • హైదరాబాదులో సెలబ్రిటీని టార్గెట్ చేసిన డి-గ్యాంగ్
  • రంగంలోకి దిగిన షార్ప్ షూటర్ నసీం
  • ప్లానింగ్ కు యూపీ గ్యాంగ్ స్టర్ ను కలిసే ప్రయత్నంలో పోలీసులకు చిక్కిన నసీం

పాకిస్తాన్‌లో తలదాచుకున్న అంతర్జాతీయ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం హైదరాబాదులో ఓ సెలబ్రిటీ తలకు 45 లక్షల రూపాయలు వెలకట్టి షార్ప్ షూటర్ ని రంగంలోకి దించడం కలకలం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... గత నవంబర్ లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ పోలీసులు షార్ప్‌ షూటర్‌ నసీం అలియాస్‌ రిజ్వాన్‌ ను అరెస్టు చేయగా, ఢిల్లీ స్పెషల్ పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఈ విచారణలో హైదరాబాదులోని సెలబ్రిటీని డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిందన్న విషయాన్ని నసీం బయటపెట్టాడు. హైదరాబాదులో ఆ సెలబ్రిటీని చంపేందుకు దావూద్ నమ్మిన బంటు చోటా షకీల్‌ తో 45 లక్షల రూపాయల సుపారీకి ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడైందని తెలుస్తోంది.

అయితే ఈ ఆపరేషన్‌ ను ఉత్తరప్రదేశ్‌ కు చెందిన గ్యాంగ్‌ స్టర్‌ మున్నా సింగ్‌ తో కలసి చేయాలని షకీల్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్నాసింగ్ ను కలిసే ప్రయత్నాల్లో ఉండగా, నసీం ప్రధాన అనుచరుడు జునైద్ చౌదరి ఇచ్చిన పక్కా సమాచారంతో అతనిని ఢిల్లీ పోలీసులు గుర్గావ్ లో అరెస్టు చేశారు.

హైదరాబాదు సెలబ్రిటీతో పాటు పాక్‌ లో పుట్టి కెనడియన్‌ గా మారిన రచయిత తారిఖ్‌ ఫథా, ‘కాఫీ విత్‌ డీ’ సినిమా నిర్మాత, మరికొందరు సెలబ్రిటీలు, తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ తదితరులను చంపేందుకు 1.5 కోట్ల సుపారీ మాట్లాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, హైదరాబాదులో డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిన సెలబ్రిటీ ఎవరు? అతడిని టార్గెట్‌ చేయాల్సిన అవసరం డి–కంపెనీకి ఎందుకు వచ్చింది? అనేవి తేలాల్సి ఉంది. 

More Telugu News