Railway: నిరుద్యోగులకు గొప్ప శుభవార్త చెప్పిన రైల్వే.. వయోపరిమితి పెంపు.. మాతృభాషలోనే పరీక్షలు!

  • అభ్యర్థుల వయోపరిమితిని పెంచిన ఆర్ఆర్‌బీ
  • మాతృభాషలోనే పోటీ పరీక్షలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. అభ్యర్థుల వయోపరిమితిని పెంచడంతోపాటు, పరీక్షలను మాతృభాషలోనే నిర్వహించనున్నట్టు పేర్కొంది. రైల్వేలో వివిధ పోస్టుల భర్తీ కోసం ఆర్‌ఆర్‌బీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 90 వేల ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా నోటిఫికేషన్‌లో పలు మార్పులు చేసింది. వయోపరిమితి పెంచాలంటూ బిహార్, మాతృభాషలోనూ పరీక్షలు నిర్వహించాలంటూ కేరళ అభ్యర్థులు చేస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసింది.

అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 28 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పెంచగా, ఓబీసీ అభ్యర్థుల వయోపరిమితిని 33 ఏళ్లకు పెంచింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయోపరిమితిని 33 నుంచి 35 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-డి పోస్టుల్లో జనరల్ అభ్యర్థుల వయో పరిమితిని 28 నుంచి 30 ఏళ్లకు పెంచింది. ఓబీసీలకు 36, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయోపరిమితిని 38 ఏళ్లకు పెంచింది. ఇక ఇప్పటి వరకు పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహించగా ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, బెంగాలీ భాషల్లోనూ నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. రైల్వే బోర్డు నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News