ND Tiwari: మాజీ గవర్నర్ తివారీకి తీవ్ర అస్వస్థత.. 72 గంటలు గడిస్తే కానీ చెప్పలేమన్న వైద్యులు

  • రక్తపోటు పడిపోవడంతో తీవ్ర అస్వస్థత
  • మ్యాక్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స
  • గతేడాది సెప్టెంబరులోనూ అస్వస్థతకు గురైన మాజీ గవర్నర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ (92) తీవ్ర అస్వస్థతతో సోమవారం ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు.  ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు 48 నుంచి 72 గంటలు గడిస్తే కానీ ఏ విషయమూ చెప్పలేమన్నారు. జ్వరం, రక్తపోటుతో బాధపడుతూ తివారీ ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు.

మధ్యాహ్నం ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం సోకగా, ఆ వెంటనే రక్తపోటు భారీగా తగ్గిందని వైద్యులు చెప్పారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ, కార్డియాలజిస్ట్ డాక్టర్ సుమీత్ సేథి బృందం తివారీకి వైద్య సేవలు అందిస్తున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. గుండె, మెదడుకు పలు పరీక్షలు నిర్వహించామని, రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తివారీ ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేసిన తివారీ రాజభవన్‌‌లో రాసలీలలు నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో దేశంలో ఈ వార్త పెద్ద సంచలనమైంది. దీంతో స్పందించిన కేంద్రం ఆయనను బర్తరప్ చేసింది.

More Telugu News