home guard: ఏపీలో హోంగార్డుల వేతనాల పెంపునకు పచ్చజెండా!

  • అధికారులు, పలువురు మంత్రులతో ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశం 
  • వచ్చే బడ్జెట్ లో ప్రతిపాదనలపై చర్చ 
  • వివిధ శాఖలకు కావాల్సిన నిధులపై వివరాలు తెలిపిన మంత్రులు, అధికారులు

రాష్ట్రంలో హోంగార్డుల వేతనాల పెంపుదలకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు. భూగర్భ, అటవీ శాఖల్లో బినామీ వ్యవస్థకు అడ్డుకట్టవేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే బడ్జెట్ లో ప్రతిపాదనలపై.. హోం, విద్యుత్, రెవెన్యూ, అటవీ, ఎక్సైజ్, దేవాదాయ, ధర్మాదాయ, కమర్షియల్ డిపార్టుమెంట్ అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తోన్న హోంగార్డుల జీతాలు పెంచాలని రాష్ట్ర డీజీపీ ఎం.మాలకొండయ్య, హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ... ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును కోరారు. ఇందుకు మంత్రి అంగీకారం తెలిపారు. ఎంత మేర పెంచాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని డీజీపీ, హోం శాఖ ముఖ్య కార్యదర్శిని కోరారు. అమరావతిలో నిర్మించతలపెట్టిన ఫోరెనిక్స్ ల్యాబ్ కు, జిల్లా స్థాయిల్లో జైళ్ల భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.

మిగిలిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలని సంబంధిత అధికారులకు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పోలీసుస్టేషన్ల భవన నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును డీజీపీ మాలకొండయ్య, హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ కోరారు. అక్టోపస్, గ్రేహౌండ్స్, ఇంటెలిజెంట్ విభాగాలకు రాబోయే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని సంబంధిత అధికారులు కోరారు.

అగ్నిమాపక కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వాహనాల కొనుగోలుకు నిధులు కావాలని ఆ శాఖ అధికారులు... ఆర్థిక మంత్రిని కోరారు. అగ్ని మాపక కేంద్రాల్లో ఖాళీల భర్తీకి అనుమతివ్వాలని ఆర్థికమంత్రిని కోరారు. ఏపీ జెన్ కో పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1500 కోట్ల మేర నష్టాలు తగ్గించుకోగలిగామని జెన్ కో జె.ఎం.డి దినేష్ పర్చూరి....ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలిపారు.

వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ కు రియంబర్స్ మెంట్ చెల్లించాలని ఆర్థిక మంత్రిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు కోరారు. స్థానిక సంస్థల ద్వారా రావాల్సిన విద్యుత్ బకాయిల వివరాలను ఆర్థిక మంత్రికి వివరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.90 కోట్లు కేటాయించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కోరారు. రెవెన్యూ శాఖలో ఖాళీ సర్వేయర్ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో రిటైర్డు సర్వేయర్లతో పాటు ఇతరులను తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు.

మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని సంబంధిత అధికారులు కోరారు. రెవెన్యూలో అవసరానికి మించి జరుగుతున్న ఖర్చుకు అడ్డుకట్టవేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశించిన ఆదాయ ఆర్జనలో అటవీ శాఖ వెనుకబడి ఉండడంపై ఆ శాఖాధికారులను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు జోరుగా సాగుతోందని, దాన్ని అరికట్టాలని ఆయన ఆదేశించారు.

అటవీ ఉత్పత్తులు గిరిజనులకే చెందాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఎర్ర చందనం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను ఆర్థికమంత్రి అడిగి తెలుసుకున్నారు. అటవీ శాఖ పరిధిలో 2 లక్షల హెక్టార్లలో పచ్చదనం పెరిగినట్లు మంత్రికి ఆ శాఖాధికారులు వివరించారు. నిర్దేశించిన లక్ష్యం కంటే అధికంగా ఆదాయం సమకూర్చిన ఎక్సైజ్ శాఖ పనితీరును ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అభినందించారు.

ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయల కల్పన, వాహనాల కొనుగోలుకు నిధులు కేటాయించాలని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ లక్ష్మీ నరసింహ కోరగా, అందుకు ఆర్థిక మంత్రి అంగీకారం తెలిపారు. భూగర్భ, గనుల శాఖ ప్రస్తుత ఏడాదిలో లక్ష్యానికి మించి 15 శాతం మేర ఆదాయం సాధించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అటవీ శాఖ మాదిరిగా ఈ శాఖలోనూ బినామీ వ్యవస్థ ఉందని, దీన్ని అరికట్టాల్సిన అవసరముందని అన్నారు. కమర్షియల్ డిపార్టుమెంట్ కు నిధుల కేటాయింపుపై కూడా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, పైడికొండల మాణిక్యాలరావుతో పాటు ప్రిన్సిపాల్ సెక్రటరీలు డి.సాంబశివరావు, రవిచంద్ర, అనురాధ, బి.శ్రీధర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

More Telugu News