Tollywood: టీడీపీని తిట్టడం తప్ప, వైసీపీ వాళ్లు చేసిందేమీ లేదు! : తమ్మారెడ్డి భరద్వాజ

  • నాలుగేళ్లుగా టీడీపీ ఏం చేయలేదన్న వైసీపీ ఏమి సాధించింది?
  • బీజేపీ-టీడీపీల పబ్బం గడిచిపోయింది
  • ప్రజల నమ్మకం సాధించాల్సిన అవసరం ఉంది వైసీపీకి

ఏపీకి అన్యాయం జరిగిందంటూ టీడీపీని తిట్టడం తప్ప, వైసీపీ వాళ్లు చేసిందేమీ లేదనీ ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. ‘నా ఆలోచన’లో ఆయన మాట్లాడుతూ, ఏపీకి అన్యాయం జరుగుతుంటే నాలుగేళ్ల నుంచి టీడీపీ చూస్తూ కూర్చుంది తప్ప, ఏం చేయలేదని అంటున్న వైసీపీ నేతలు, ఈ నాలుగేళ్లుగా వాళ్లు చేసిందీ శూన్యమని విమర్శించారు. ఢిల్లీలో రెండు సార్లు జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేశామని, ఏపీలో ఏదో చేస్తున్నామని వైసీపీ వాళ్లు చెబుతున్నారని, ఏది చేసినా చిత్తశుద్ధితో చేయాలని సూచించారు.

‘వైసీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోయింది. ఏపీకి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ కోసమూ ఆ పార్టీ  పోరాడలేకపోయింది. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీతో టీడీపీ కలిసి పనిచేస్తోంది. వాళ్ల (బీజేపీ-టీడీపీ) పబ్బం గడిచిపోయింది. రాజ్యాధికారం వారి చేతికొచ్చింది కనుక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఐదేళ్లు నడుస్తుంది. కానీ, ప్రజల నమ్మకాన్ని సాధించాల్సిన అవసరం ఉన్నది మీకు (వైసీపీ). కానీ, నాలుగేళ్ల నుంచి  మీరు (వైసీపీ) చంద్రబాబును, టీడీపీని తిట్టడమో లేకపోతే అధికారంలోకి వచ్చాక ఏదో చేస్తామని చెప్పడమో తప్ప, నిజంగా మీరు (వైసీపీ) ఏం చేశారు? నిజాయతీగా ఆలోచించండి!’ అని తమ్మారెడ్డి విమర్శించారు.

More Telugu News