Mahonar Parikar: మనోహర్ పారికర్ ఆరోగ్యం విషమమంటూ వార్తలు... వివరణ ఇచ్చిన లీలావతి ఆసుపత్రి!

  • అనారోగ్యంతో ముంబై ఆసుపత్రిలో చికిత్స
  • ఆయన ఆరోగ్యం విషమించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు
  • అంతా అవాస్తవమని ప్రకటించిన లీలావతి ఆసుపత్రి

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన ఆరోగ్యం విషమించిందని వచ్చిన వార్తలను, చికిత్స అందిస్తున్న ముంబైలోని లీలావతి ఆసుపత్రి వైద్యబృందం ఖండించింది. పారికర్‌ ఆరోగ్యం కుదుటపడుతోందని, కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమేనని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన ఆరోగ్యంపై తప్పుడు సమాచారాన్ని కొందరు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.

 కాగా, ఈనెల 15 నుంచి పారికర్, లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఆదివారం నాడు ముంబైకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, లీలావతి ఆసుపత్రికి వెళ్లి పారికర్ ను పరామర్శించి వచ్చారు. గోవా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనోహర్ పారికర్ పాల్గొనే అవకాశాలు లేవని వార్తలు రాగా, వాటిని బీజేపీ ప్రతినిధులు ఖండించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడగానే, అసెంబ్లీకి వస్తారని సీఎం కార్యాలయం వెల్లడించింది.

More Telugu News