Alwal Hills: ఆరేళ్ల పాప రాసిన లెటర్ కు ఫిదా అయిన కేటీఆర్!

  • ఆల్వాల్ హిల్స్ లో ఉంటున్న చిన్నారి సుప్రియ
  • సుచిత్ర కూడలి వద్ద యాచకులుగా చిన్నారులు
  • వారిని మార్చాలని కోరిన సుప్రియ
  • శ్రద్ధ చూపుతానని కేటీఆర్ హామీ

'డియర్ కేటీఆర్ అంకుల్...' అంటూ ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారి సుప్రియ రాసిన లేఖకు తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. పాప రాసిన లెటర్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంటూ ఆమె కోరికను తీరుస్తానని చెప్పారు. ఇంతకీ ఆ పాప ఏం రాసిందో తెలుసా?...

"నేను సుప్రియని. వయసు ఆరు సంవత్సరాలు. ఆల్వాల్ హిల్స్ లోని సెయింట్ పయాస్ టెన్త్ స్కూల్ లో ఒకటో తరగతి చదువుకుంటున్నాను. సుచిత్రా జంక్షన్ వద్ద పిల్లలు భిక్షాటన చేస్తున్నారు. వారికి ఉండేందుకు ప్రదేశం, ఆహారం, విద్యను అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకోసం నా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 2000 రూపాయలను మిమ్మల్ని కలిసి ఇస్తాను" అని రాసింది.

ఆ పాప తండ్రి నాగేశ్వరరావు కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ, లెటర్ ను ట్విట్టర్ లో పోస్టు చేయగా, దాన్ని చూసిన కేటీఆర్ స్పందించారు. 'మీ పాపకు నా తరఫున థ్యాంక్స్ చెప్పాలని, ఆ పాప చెప్పిన చిన్న పిల్లల పట్ల తప్పకుండా శ్రద్ధ తీసుకుంటా'మని చెప్పారు. ఇక ఆ పాప తన కిడ్డీ బ్యాంకు సేవింగ్స్ ను ఇస్తానని చెప్పడం ఆ పాప మంచి మనసును సూచిస్తోందని వ్యాఖ్యానించారు.

More Telugu News