Telangana: మరో అంతర్జాతీయ సంస్థ నుంచి కేటీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం

  • జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ నుంచి ఆహ్వానం
  • తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ప్రసంగించాలని విజ్ఞప్తి
  • హంబర్గ్ లో మార్చి 2న సమావేశం
  • ప్రత్యేక ఆహ్వానంపై కేటీఆర్ హర్షం

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి ఆహ్వానం అందింది. జర్మనీకి చెందిన ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ 98వ సమావేశానికి హాజరుకావాలని కేటీఆర్ ని ఆహ్వానించింది. ఈ సమావేశం జర్మనీలోని హంబర్గ్ లో మార్చి 2 వ తేదిన జరగనుంది. తెలంగాణలో ఉన్న అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని సదరు సంస్థ కేటీఆర్ ని కోరింది. ఈ సమావేశం ద్వారా తెలంగాణ, జర్మనీ మధ్య వాణిజ్య బంధం మరింత విస్తృతమవుతుందని అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ప్రత్యేక ఆహ్వానంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

కాగా, ఆసియా దేశాలతో జర్మనీ నిర్వహించే వ్యాపార వాణిజ్య అవకాశాలను చర్చించే నిమిత్తం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సమావేశానికి అంతర్జాతీయంగా 300 మంది వాణిజ్య వేత్తలు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు హాజరుకానున్నట్టు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న పలు సంక్షేమ, ఆర్థిక విధానాలపై జర్మన్ వ్యాపార వర్గాలకు ఆసక్తి ఉందని, అందుకే తమ దేశంలోని అగ్ర స్థాయి వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపింది. 

More Telugu News