Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' రిలీజ్ డేట్ ప్రకటన!

  • మే 11న రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతల సన్నాహాలు
  • రామోజీ ఫిలిం సిటీ, పొల్లాచ్చి ప్రాంతాల్లో చిత్రీకరణ
  • పీటర్ హెయిన్స్ పోరాటాలు స్పెషల్

దర్శకుడు శ్రీవాస్‌కి రెండక్షరాల టైటిళ్లు బాగా ఇష్టమనిపిస్తోంది. గతంలో గోపీచంద్‌తో 'లౌక్యం' సినిమా చేసిన ఆయన ఇప్పుడు యూత్ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్, పొడుగుకాళ్ల సొగసరి పూజా హెగ్డే జంటగా తెరకెక్కిస్తున్న చిత్రానికి కూడా అదే రైమింగ్ వచ్చేలా 'సాక్ష్యం' అనే పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిసింది. ప్రకృతే సాక్ష్యం అన్నది ఉప శీర్షిక.

 ఈ సినిమాలోని పలు ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ, పొల్లాచ్చి, వారణాసి, దుబాయ్, హోస్పేట్ తదితర ప్రాంతాల్లోని అనేక అందమైన లొకేషన్లలో షూట్ చేశామని ఈ చిత్ర నిర్మాత చెప్పారు. ముఖ్యంగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో కంపోజ్ చేసిన యాక్షన్ సీన్లు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయని ఆయన అంటున్నారు.

 ఇందులో ఇతర నటీనటులుగా జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, బ్రహ్మాజీ, రవి కిషన్, అశుతోష్ రానా, మధు గురుస్వామి, లావణ్య నటించారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందించగా, హర్షవర్ధన్ సంగీతం సమకూరుస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించారు.

More Telugu News