Yanamala Ramakrishnudu: ఏపీ దుస్థితికి జైరామే కారణం : యనమల ధ్వజం

  • జైరామ్ విభజన చట్టం ఘోస్ట్ రైటరని మండిపాటు
  • పోలవరంపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని హితవు
  • ఆధారాలుంటే చూపాలని మంత్రి సూచన

తమ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశే కారణమని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి కావడానికి అవకాశమిచ్చిన రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. న్యాయం కోసం టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే కాంగ్రెస్ నేతలు కనీసం పెదవి విప్పకపోవడాన్ని యనమల తీవ్రంగా తప్పుబట్టారు. ఏమాత్రం స్పష్టత లేని విభజన చట్టానికి జైరామ్ ఘోస్ట్ రైటర్ అని ఆయన అన్నారు.

ఉద్దేశ్యపూర్వకంగానే లోపభూయిష్టమైన చట్టం చేసి ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆయన దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుపై జైరామ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యనమల ఈ మేరకు ధ్వజమెత్తారు. జైరామ్ తప్పుడు ఆరోపణలు చేయడం మాని ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో జైరామ్ డ్రామాను ప్రజలు మరిచిపోలేదని, విభజన కపట నాటక సూత్రధారి ఆయనేనని నిప్పులు చెరిగారు. విభజన చట్టంలో మార్చలేనన్ని తప్పులు చేసి ఇప్పుడు మార్చమని చెప్పడాన్ని యనమల తీవ్రంగా తప్పుబట్టారు.

More Telugu News