Karisma: ఒకే వేదికపై బాలీవుడ్ అందాల సోదరీమణులు!

  • మహిళా దినోత్సవంలో కరిష్మా, కరీనా సందడి
  • తమ అనుభవాలను పంచుకోనున్న ముద్దుగుమ్మలు
  • అభిమాన తారలను చూడ్డానికి ఫ్యాన్స్ తహతహ

తమ అందచందాలతో, అభినయంతో బాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న అందాల సోదరీమణులు కరిష్మా కపూర్, కరీనా కపూర్‌లు ఒకే వేదికపై దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వారిద్దరూ కలిసి ఒకే ఒక వాణిజ్య ప్రకటనలో దర్శనమిచ్చారు. అయితే వారిద్దరూ కలిసి వెండితెరపై నటించలేదు. అందుకు తగ్గ స్క్రిప్ట్ వస్తే తప్పకుండా నటిస్తామని గతంలో వారు ప్రకటించినప్పటికీ, అలాంటి కథ ఇంకా తయారు కాలేదు. అయితే వారి అభిమానులకు మాత్రం వారిద్దరిని ఒకే వేదికపై చూసే భాగ్యం దక్కనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ముంబైలో వచ్చే నెలలో జరగనున్న ఓ కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొననున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారమ్.

ఈ సందర్భంగా కపూర్ ఫ్యామిలీ నుంచి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తొలి అమ్మాయిగా తన అనుభవాలను కరిష్మా పంచుకోనుంది. ఇక కరీనా కపూర్ తన ప్రొఫెషనల్ లైఫ్‌ని, వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా బ్యాలెన్స్‌గా నడిపిస్తున్నదీ, బాలీవుడ్‌లో హీరోయిన్లు రూల్స్‌ని ఎలా మారుస్తున్నారన్న దాని గురించి తెలపనుందట.  

More Telugu News