Nellore District: నెల్లూరు బురిడీ బాబా దోపిడీ వెనకున్న యువతి ఈమే!

  • కలకలం సృష్టించిన సుధాకర్ మహరాజ్
  • ఆత్మహత్యాయత్నం చేయడంతో వ్యవహారం వెలుగులోకి
  • ఆయన వెనకుండి కథ నడిపించిన వాసంతి
  • పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు

నెల్లూరులో కలకలం సృష్టించిన బురిడీ బాబా సుధాకర్ మహరాజ్ దందాల వెనుక ఆయనతో సహజీవనం చేస్తున్న వాసవి అనే మహిళ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆశ్రమంపై దాడులు చేయడానికి ముందే నగదు, నగలు, విలువైన వస్తువులు, కీలక పత్రాలను ఆమె మాయం చేసిందని అనుమానిస్తున్నట్టు వెల్లడించారు. సుధాకర్ ఆశ్రమానికి వస్తున్న నగదును ఆమె తన సొంత ఖాతాలోనే జమ చేసుకుందని తెలిసిందని పేర్కొన్నారు.

ఈ కేసులో ఓ మీడియా ప్రతినిధికీ ప్రమేయం ఉందని, వీరు ఓ ముఠాగా ఏర్పడి ఆధ్యాత్మిక సదస్సులు పెట్టేవారని, పలువురు ప్రముఖులకు ఆశ్రమంలో బస ఏర్పాటు చేసి వారి వద్దకు అమ్మాయిలను పంపేవారని కూడా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఓ మాజీ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లాలో పని చేస్తున్న అదనపు ఎస్పీ, టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఆశ్రమంలో ఏకాంత సేవలను పొందారని చెప్పారు.

కాగా, సుధాకర్ మహరాజ్ ఆత్మహత్యాయత్నం చేసిన తరువాత మొత్తం వ్యవహారం బయటకు రాగా, వాసంతి పారిపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్, అరెస్టును తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సుధాకర్ పై సుమారు 170 మంది వరకూ ఫిర్యాదులు చేయగా, కోట్ల రూపాయల మోసం జరిగిందని, కేసును విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్న వాసంతిని తడ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి వుంది.

More Telugu News