Punjab National Bank: నీరవ్ మోదీ కోసం వేట మొదలు..ఇంటర్‌పోల్ 'రెడ్ కార్నర్' నోటీసు జారీ!

  • నీరవ్ జాడ కోసం ఇంటర్ పోల్ సాయం కోరిన సీబీఐ
  • నీరవ్ మామ, వ్యాపార భాగస్వామి మేహుల్ పాస్‌పోర్టులు రద్దు
  • రద్దుపై స్పందించేందుకు వారం రోజుల గడువు

పంజాబ్ నేషనల్ బ్యాంకు (బీఎన్‌బీ)లో దాదాపు రూ.11,300 కోట్ల మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని పట్టుకోవడానికి వేట మొదలయింది. అంతర్జాతీయ పోలీసు వ్యవస్థ 'ఇంటర్‌పోల్' ఆయనపై రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. నీరవ్‌తో పాటు ఆయన కుటుంబం జాడ కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ 'సీబీఐ' చేసిన విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్‌ ఈ మేరకు నోటీసు జారీ చేయడం గమనార్హం.

ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో నీరవ్‌తో పాటు మేహుల్ పేరును కూడా చేర్చారు. మోసం వెలుగుచూడటానికి ముందే నీరవ్ భారతదేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో ఆయన పాస్‌పోర్టును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది.

మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సలహా మేరకు నీరవ్ తో పాటు ఆయన మామ, వ్యాపార భాగస్వామి మేహుల్ చోక్సి పాస్ పోర్టును కూడా నాలుగు వారాల పాటు రద్దు చేశారు. పాస్‌పోర్టు చట్టం, 1967లోని సెక్షన్ 10 (3)(సి) కింద తమ పాస్ పోర్టులను ఎందుకు రద్దు చేయరాదనే దానిపై నిందితులు వారం రోజుల్లోగా స్పందించాల్సి ఉంటుందని, ఆ లోగా వారి నుంచి సరైన సమాధానం రాకుంటే వారి పాస్ పోర్టులను రద్దు చేస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఎంఈఏ ప్రతినిధి రవీష్ కుమార్ ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ...ఈడీ సలహా మేరకు నిందితుల పాస్ పోర్టులను రద్దు చేశామని చెప్పారు.

More Telugu News