Undavalli: జేఎఫ్‌సీ రిపోర్టు అధికారిక రిపోర్టులాంటిదే!: ఉండవల్లి అరుణ్ కుమార్‌

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఇద్ద‌రు అధికారుల‌ను పంపుతుంది
  • 100 శాతం నిజం అని నిర్ధారించుకున్నాకే నిజమని ప్రకటిస్తాం
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జేఎఫ్‌సీ సభ్యుడు పద్మనాభం చర్చిస్తారు
  • ఇటువంటి చర్చలు చాలా మంచివి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన సాయంపై జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చొర‌వతో జేఎఫ్‌సీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చర్చించడానికి ఈ రోజు హైదరాబాద్‌లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఈ సందర్భంగా రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఇద్ద‌రు అధికారుల‌ను తమ వద్దకు పంపుతుందని అన్నారు. దీంతో జేఎఫ్‌సీ ఇచ్చే నివేదిక అధికారిక రిపోర్టులాంటిదేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం 100 శాతం నిజం అని నిర్ధారించుకున్నాకే నిజమని ప్రకటిస్తామని అన్నారు.

చేసిన సాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రకటనల్లో కొన్ని తేడాలు ఉన్నాయని, అనుమానాలు ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జేఎఫ్‌సీ సభ్యుడు పద్మనాభం చర్చిస్తారని ఉండవల్లి తెలిపారు. ప్రజల్లో ప్రస్తుతం కొంత తికమక ఉందని అన్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని అధికార పార్టీ కూడా పూర్తిగా వదిలిపెట్టలేదని, మళ్లీ ఆ అంశాన్ని అడుగుదామా? అనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా లోపల ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు.
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ తనకు ఫోన్ చేసి ర‌మ్మ‌న్న త‌రువాత ఇటువంటి చ‌ర్చ‌లు, నిజ నిర్ధారణ కమిటీలు ప్రజాస్వామ్య దేశంలో చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయని తనకు అనిపించిందని ఉండవల్లి తెలిపారు. ప్ర‌జా స్వామ్యంలో ఇటువంటి చ‌ర్చ‌లు జ‌ర‌గాలని అన్నారు.

More Telugu News