jyothika: సినిమా డైలాగుల వివాదం: సినీ నటి జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు

  • 'నాచియార్' అనే సినిమాలో నటించిన జ్యోతిక
  • వివాదాస్పదమైన జ్యోతిక డైలాగులు
  • చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు

ప్రముఖ సినీ నటి, హీరో సూర్య భార్య జ్యోతికపై హిందూ మక్కళ్ కట్చి నేతలు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, బాలా దర్శకత్వం వహించిన 'నాచియార్' చిత్రంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ఇంతకుముందే వివాదం చెలరేగింది. పలు సంఘాలు చేపట్టిన నిరసనలతో... ఆ సన్నివేశాల్లోని సంభాషణలను చిత్ర యూనిట్ బీప్ చేసింది. నిన్న ఈ సినిమా విడుదల అయింది.

అయితే, ఈ సినిమాలో ఓ సన్నివేశంలో 'మాకు ఆలయాలైనా, చెత్తకుప్పలైనా ఒక్కటే' అనే డైలాగ్ ఉంది. జ్యోతికకు చెందిన ఈ డైలాగ్ పై హిందూ మక్కళ్ కట్చి నేతలు మండిపడ్డారు. ఈ సంభాషణలు హిందూ దేవాలయాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు సంభాషణలను వెంటనే తొలగించాలని... జ్యోతిక, దర్శకుడు బాలాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

More Telugu News