West Bengal: బర్త్ డే పార్టీకి పిలిచి విద్యార్థినిపై స్నేహితుల సామూహిక అత్యాచారం!

  • పశ్చిమ బెంగాల్‌లో దారుణం
  • పార్టీకి పిలిచి మద్యం తాగించి అఘాయిత్యం
  • పోలీసుల అదుపులో ముగ్గురు విద్యార్థులు
  • పరారీలో మరో విద్యార్థి.. గాలింపు

బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్థినిపై ఆమె స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా, రత్తాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెను చంపేందుకు ప్రయత్నించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. తన అంకుల్ ఇంట్లో బర్త్ డే పార్టీ చేసుకుంటున్నానని, రావాల్సిందిగా 12వ తరగతి చదువుతున్న తన స్నేహితురాలైన బాలికను నిందితుడు ఆహ్వానించాడు. ఆ ఇంటి కుటుంబ సభ్యులు వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయటకు వెళ్లడంతో ఆ ఇల్లు ఖాళీగా ఉంది. సాయంత్రం పొద్దుపోయాక బాలిక ఆ ఇంటికి వెళ్లగా ఆమె స్నేహితుడు మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతున్నాడు. ఆమె రావడంతో మద్యంలో డ్రగ్స్ కలిపి ఆమెతో బలవంతంగా తాగించాడు. స్పృహ తప్పి పడిపోయిన ఆమెపై నలుగురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చంపేందుకు ప్రయత్నించినా కుదరకపోడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు.

రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న ఆ ఇంటి కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చూసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.

ఈ కేసుకు  సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అతడిని కూడా పట్టుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News